హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులవుతున్న సందర్భంగా పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన ఆయన వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ మాట్లాడుతూ రేవంత్రెడ్డి వ్యవహారశైలి ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ను రాజీనామా చేయాలనడం దారుణమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత కేసీఆర్కు భద్రత కల్పించడం రాజ్యాంగబద్ధమైన బాధ్యత అని, దీనిపై రూ. 22 కోట్ల ఖర్చు అంటూ సీఎం పిచ్చిగా మాట్లాడటమేందని విమర్శించారు. కేసీఆర్ పథకాలను ఎందుకు బంద్ చేశారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు ఏమయ్యిందో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాలను ఏపీకి ధారాదత్తం చేస్తూ రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు.
నల్లగొండకు చేసిందేమి లేదు: చిరుమర్తి
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ సీఎం తన నియోజకవర్గానికి వచ్చి నిధులు కేటాయిస్తారనుకుంటే ఒంటినిండా విషంతో వచ్చి తిట్ల దండకం అందుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నకిరేకల్లో 100 పడకల దవాఖానతో సహా సమగ్ర అభివృద్ధి కేసీఆర్ హయాంలోనే జరిగిందని, రేవంత్ కొత్తగా ఒక రూపాయి పని కూడా ప్రకటించలేకపోయారని ఎద్దేవా చేశారు. రైతు బీమా , రైతుబంధుకు మంగళం పాడారని మండిపడ్డారు.
మూటలు ఇచ్చి పదవులు తెచ్చుకున్న బ్లాక్మెయిలర్ కేసీఆర్ భద్రత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ముందుగా సీఎం రేవంత్ కుటుంబ సభ్యుల భద్రత కోసం ప్రభుత్వ ఖజానా సొమ్మును దుబారా చేయడం ఆపాలని హితవు పలికారు. నల్లగొండ ప్రాజెక్టులను పడావు పెట్టిన చరిత్ర రేవంత్దేనని విమర్శించారు. రాష్ట్రంలో రేవంత్ సోదరులు, పొంగులేటి దందాలకు హద్దే లేకుండా పోయిందని, 22ఏ ద్వారా వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్లలో ఏదో చేస్తానంటున్న ఆయన ముందు కొడంగల్లో గెలువాలని సవాల్ విసిరారు.
చంద్రబాబు మెప్పు కోసమే తిట్లపురాణం: కూసుకుంట్ల
మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కేవలం ఏపీ సీఎం చంద్రబాబు మెప్పుకోసమే కేసీఆర్పై సీఎం రేవంత్ విషం చిమ్ముతున్నారని విమర్శించారు. కేసీఆర్ రాజీనామా చేస్తే తెలంగాణ మొత్తం కన్నీళ్లు పెడుతుందని, అదే రేవంత్ రాజీనామా చేస్తే ప్రజలు పండుగ చేసుకుంటారని తెలిపారు. నల్లగొండ జిల్లాకు ఏం కావాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. డిండి ప్రాజెక్టు ద్వారా దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు ఇవ్వకపోతే ఆయనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మునుగోడు ఎమ్మెల్యే గోల్మాల్ గోపాల్గా మారి మంత్రి పదవి కోసం సీఎం కాళ్లు పట్టుకున్నారని ఎద్దేవా చేశారు.