Minister Harish Rao | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ సెంచరీ కొట్టడం పక్కా అని మంత్రి హరీశ్రావు అన్నారు. కేసీఆర్ పాలనే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, మూడోసారి గెలిపించాలని, అభివృద్ధిని కొనసాగిద్దామంటూ ఆయన ఓటర్లకు ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఏ పార్టీ పోటీ కాదని, కాంగ్రెస్ కు ఓటేస్తే కుక్కలు చింపిన విస్తరేనన్నారు. బీజేపీకి ఒక్క చోట కూడా డిపాజిట్ రాదన్నారు. షెడ్యూల్ వచ్చిందని, పొలిటికల్ టూరిస్టులు వస్తారని, వారితో అప్రమత్తంగా ఉండాలన్నారు.
వాళ్లు ఇచ్చే ఉత్తుత్తి హామీలు నమ్మొద్దని, ప్రజలు ప్రతి అవసరాలను, ఆకాంక్షలను గుర్తించి వాటిని బీఆర్ఎస్ నెరవేరుస్తున్నదన్నారు. కార్యకర్తలు ప్రజలను చైతన్యం చేయాలని, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. 16న బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ ప్రజల ముందు ఉంచుతారని, అభివృద్ధి, సంక్షేమాన్ని కొనసాగిస్తూనే, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా మేనిఫెస్టో ఉంటుందన్నారు. మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాలకు దిమ్మ తిరుగుతుందని, సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడంటే నెరవేర్చుతారనే నమ్మకం ప్రజల్లో ఉన్నదన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉండి తెలంగాణను అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు.. తెలంగాణ పుట్టుకనే జీర్ణించుకోలేని బీజేపీ మరోవైపు ఉన్నాయని.. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్న బీఆర్ఎస్ ఓ వైపు ఉన్నాయన్నారు. రైతులకు మూడు గంటల కరంటు చాలు అంటున్న కాంగ్రెస్ పార్టీ, రైతుల మోటర్లకు కరంటు మీటర్లు పెడుతున్న బీజేపీ పార్టీలు ఒక వైపనీ.. సీఎం కేసీఆర్ విశ్వసనీయత ఒక వైపు అన్నారు. బీజేపీ విద్వేష ప్రచారం, కాంగ్రెస్ విషప్రచారం ఇంకో వైపు.. రూ.200 మించి పింఛన్ ఇయ్యలేని కాంగ్రెస్ ఇప్పుడు ఆరు హామీలంటూ కొత్త డ్రామా ఆడుతోందన్నారు.
కర్నాటకలో విచ్చలవిడి అవినీతితో బీజేపీ అధికారం కోల్పోతే.. నమ్మి ఓటేసిన ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక వంద రోజుల్లోనే కాంగ్రెస్ బొక్క బోర్లాపడ్డదన్నారు. రాష్ట్రాలను అంధకారంలో ముంచడంలో.. అధికారం కోసం ఎంతకైనా దిగజారడంలో పోటీ పడుతున్న ఆ రెండు పార్టీలు తెలంగాణను దోచుకోవడానికి దండెతుతున్నాయన్నారు. ప్రతిపక్షాల గాలి మాటలను, మోసపూరిత హామీలను ప్రజలు నమ్మరని.. ప్రజలు వాస్తవాలు గ్రహించేలా నేతలు, కార్యకర్తలు వివరించి చెప్పాలన్నారు.