Dasoju Sravan | హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణను కించ పరిచేందుకే కాంగ్రెస్ పార్టీ శ్వేతపత్రాల పేరుతో కొత్త డ్రామాలకు తెరతీసిందని బీఆర్ఎస్ సీనియన్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి శ్రవణ్ బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ శ్వేతపత్రాలు తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుల ఆలోచనా విధానం కనిపించిందన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే తెలంగాణ అభివృద్ధి చెందితే మరి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎందుకు పుట్టుకొచ్చేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు తెలంగాణ ఉద్యమాన్ని, అస్థిత్వాన్ని, అమరవీరుల త్యాగాలను కించపరిచేలా ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఈ విషయాన్ని గుర్తించాలన్నారు. శ్వేతపత్రాలు తెలంగాణను వ్యతిరేకించే ఆంధ్ర మేధావులు, ఆంధ్ర పెట్టుబడిదారులు, తెలంగాణ ద్రోహులు అందరూ కూడగట్టుకుని తయారు చేసినట్టే ఉన్నాయని ఆరోపించారు.
కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించిన ప్రగతిని పక్కన పెట్టేసి, గతంలో అంతా అభివృద్ధి జరిగిందని చెప్పడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ మీద అక్కసుతో అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచార పర్యవసానం భవిష్యత్ పారిశ్రామిక పెట్టుబడులకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కొత్త ప్రభుత్వం శ్వేత పత్రాలు విడుదల చేసేందుకు కోట్ల రూపాయల ఖర్చుతో అసెంబ్లీ సమావేశాలు ఎందుకని ప్రశ్నించారు.
పత్రికా సమావేశాలు నిర్వహించి ఆ పత్రాలు విడుదల చేస్తే సరిపోయేది కదా? అని హితబోద చేశారు. తప్పు జరిగితే విచారణకు ఆదేశించడానికి అసెంబ్లీ సమావేశాలు వేదిక కావాలా? అని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండోరోజు నుంచే గత ప్రభుత్వంపై బట్టకాల్చి మీద వేసే రాజకీయాలకు శ్రీకారం చుట్టిందన్నారు. తెలంగాణ అప్పుల పాలైందనే ప్రచారంతో రాష్ట్ర భవిష్యత్తు అంధకారమయ్యే అవకాశం ఉన్నదని, మళ్లీ తెలంగాణలో చీకట్లు కమ్ముకునే ప్రమాదం పొంచి ఉన్నదని.. ఇకనైనా రాజకీయ స్వార్థాలన్నీ పక్కనపెట్టి తెలంగాణ భవిష్యత్తు కోసం ముందుకు సాగాలన్నారు. ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను నెరవేర్చాలని హితబోద చేశారు.