హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్కు, కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి మధ్య అగాధం ఏర్పడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన వైరుధ్య సంఘటనలే ఇందుకు నిదర్శమని పేర్కొంటూ ఆయన చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ వైఎస్సార్టీపీ నాయకురాలు షర్మిల సోనియాగాంధీని, రాహుల్గాంధీని కలిసిన రోజే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావును పీసీసీ అధ్యక్షుడు రేవంత్ కలిసి పార్టీలోకి ఆహ్వానించిన వైనాన్ని ఆయన ఉదహరించారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఏఐసీసీకి, రేవంత్కు మధ్య విభేదాలు, అగాధం ఉన్నట్టు కనిపిస్తున్నదని తెలిపారు. సమీప భవిష్యత్తులో షర్మిల, రేవంత్కు మధ్య తగాదాలు తారస్థాయికి చేరుకొనే అవకాశాలున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో గ్రూపు తగాదాలకు నెలవైన రేవంత్ కాంగ్రెస్ కావాల్నా? లేక క్రెడిబిలిటీ, క్యారెక్టర్, కమిట్మెంట్ ఉన్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కావాల్నా అనే విషయాన్ని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలని శ్రవణ్ హితవు పలికారు.