ఎన్టీఆర్ వచ్చాకే రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ప్రారంభమైంది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టెడన్నం దొరికింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. తుడిచేస్తే పోయేది కాదు. ఆ మహనీయుడు వచ్చిన తర్వాతే పేదసాదలకు బుక్కెడు బువ్వ దొరికింది. తెలంగాణ వచ్చాక ఎన్టీఆర్ను మించిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసింది.
– కేసీఆర్
KCR | హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఈసారి కేంద్రంలో ఏర్పడేది సంకీర్ణ ప్రభుత్వమేనని, దాంట్లో కీలక పాత్ర పోషించేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 200 సీట్లు కూడా దాటే పరిస్థితి లేదని, యావత్ ప్రపంచం ఇదే విషయమై కోడై కూస్తున్నదని పేర్కొన్నారు. బీజేపీకి 370 స్థానాలు, ఎన్డీఏకు 400 సీట్లు వస్తాయనడం ఉత్తమాటేనని చెప్పారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అవుతారని చెప్పారు. తెలంగాణ ఓ దశలో పంజాబ్ను తలదన్నేలా మూడున్నర కోట్ల టన్నుల ధాన్యం పండిస్తే కేంద్రం కొనకుండా మొండికేసిందని గుర్తుచేశారు.
అప్పుడు బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేతగా ఉన్న నామా నాగేశ్వరరావు నాయకత్వంలో ఎంపీలు ఢిల్లీ వెళ్లి వడ్లు కొనాలని కోరితే తెలంగాణ ప్రజలను నూకలు తినాలని కేంద్రమంత్రి సూచించారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తెలంగాణ క్యాబినెట్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లి ధర్నా చేశారని గుర్తుచేశారు. అప్పుడు ఒక్క బీజేపీ ఎంపీగానీ, ఒక్క కాంగ్రెస్ ఎంపీగానీ నోరు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి తెలంగాణ ప్రజల ఓట్లు కావాలి కానీ, రైతుల సమస్యలు పట్టవని మండిపడ్డారు.
రాష్ట్ర సమస్యలు పట్టని దద్దమ్మలు?
గోదావరి నదిని ఎత్తుకెళ్లి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లిస్తామని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్తున్నా ‘కిషన్రెడ్డి కానీ, రేవంత్రెడ్డి కానీ మాట్లాడుతున్నరా?’ అన్న ప్రశ్నకు ప్రజలు ‘లేదు.. లేదు’ అని సమాధానమిచ్చారు. ‘మరి ఈ దద్దమ్మలు మనకెందుకు?’ అని ప్రశ్నించారు. 75 ఏండ్లపాటు రాష్ట్రంలో నీటి ఇబ్బందులను ఎవరూ పట్టించుకోలేదని విమర్శించారు. కృష్ణాలో నీరు లేనప్పుడు పంటలు ఎండిపోతున్నాయని, నాగార్జునసాగర్ ఆయకట్టులో సైతం ఇబ్బందులు వస్తున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ర్టానికి ఉన్న ఒకే ఒక ఆశ గోదావరినదేనని స్పష్టం చేశారు.
ఖమ్మం జిల్లా ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని దుమ్ముగూడెం వద్ద సీతారామ ప్రాజక్టు నిర్మాణం చేపట్టామని, 37 టీఎంసీల సామర్థ్యం గల ఈ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలో ఒక్క అంగుళం కూడా మిగలకుండా నీరు పారుతుందని వివరించారు. ఇచ్చంపల్లి వద్ద ప్రాజెక్టు నిర్మించి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లు తరలిస్తాని మోదీ అంటుంటే రేవంత్రెడ్డి, నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. ‘నేను సీఎంగా ఉన్న సమయంలో నరేంద్రమోదీ ఇదే ప్రతిపాదన పెట్టిండు. ఎట్టి పరిస్థితుల్లో మా రాష్ర్టానికి వచ్చే నీళ్ల లెక్క తేల్చేదాకా, మా వాటా మాకు పెట్టేదాకా తల తెగిపడ్డా సరే ఒప్పుకోను అని చెప్పిన. అది బీఆర్ఎస్ పార్టీ పాలసీ’ అని వివరించారు.
12 స్థానాల్లో బీఆర్ఎస్ గెలుపు
తాను ఆరు రోజులుగా పర్యటిస్తున్నానని, ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కేసీఆర్ చెప్పారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 12 స్థానాల్లో గెలవబోతున్నదని ధీమా వ్యక్తం చేశారు. నామాను గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అవుతారని, అప్పుడు రాష్ర్టానికి, ఖమ్మం జిల్లాకు మేలు జరుగుతుందని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
‘నరేంద్రమోదీ దాడి నుంచి, చేతగాని.. చేవలేని కాంగ్రెస్ నుంచి మన గోదావరి, కృష్ణా నదులను రక్షించుకోవాలన్నా, మన నిధులను మనం తెచ్చుకోవాలన్నా, మన హామీలను, మన హక్కులను సాధించుకోవాలన్నా బీఆర్ఎస్ అయితేనే పేగులు తెగేదాకా కొట్లాడుతది’ అని స్పష్టం చేశారు. తెలంగాణ కోసం తాను ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటే అరెస్ట్ చేసి ఖమ్మం జైలులోనే పెట్టారని గుర్తుచేశారు. నాడు ఖమ్మం బిడ్డలు, న్యూడెమోక్రసీ, కమ్యూనిస్ట్ విద్యార్థి బృందాలు, తెలంగాణవాదులు తనకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించారని తెలిపారు.
ఆ ఘటనను తాను ఎన్నటికీ మర్చిపోలేని పేర్కొన్నారు. ‘తెలంగాణ వచ్చాక, కుల, మత, జాతి ప్రసక్తి లేకుండా అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాదుకున్నం. రైతులకు పెట్టుబడి సాయం అందించినం. రైతుబీమా కల్పించినం. 24 గంటలు రెప్పపాటు కూడా పోకుండా కరెంటు సరఫరా కల్పించినం. 7,500 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల పంటలను కొన్నం. దళారులు లేకుండా నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వేసినం’ అని గుర్తు చేశారు.
హామీలు నెరవేర్చలేక నిందలు
అబద్ధాలు చెప్పి, అడ్డగోలు హామీలు ఇచ్చి, ప్రజలను బురిడీ కొట్టించి గద్దెకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని కేసీఆర్ ఆరోపించారు. ‘రూ.2,500 ప్రతి మహిళలకు ఇస్తామన్నరు వచ్చిందా?’ అని కేసీఆర్ అడిగితే.. ‘లేదు’ అని ప్రజలు చేతులుపైకెత్తారు. ‘ఇక వచ్చే ఆశ ఉన్నదా?’ అని అడగ్గా ‘లేదు’ అని సమాధానం వచ్చింది.
ఇదే అంశంపై శాసనసభలో, బయట బీఆర్ఎస్ ప్రశ్నిస్తే ‘నేను జానారెడ్డిని కాదు.. నేను ఫలానా కాదు, కేసీఆర్ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా, నిన్ను పండబెట్టి తొక్కుతా, నిన్ను చర్లపల్లి జైలుల్లో వేస్తా, నీ పేగులు తీసి మెడలో వేసుకుంటా’ అని ముఖ్యమంత్రి దుర్భాషలాడుతున్నాడని ఆవేదన వ్యక్తంచేశారు. ‘తెలంగాణను పాలించిన నన్ను జైలులో వేస్తానని రేవంత్ అంటుండు. జైలులో వేస్తానంటే కేసీఆర్ భయపడతడా? జైళ్లకు నేను భయపడతనా? భయపడితే తెలంగాణ వచ్చేదా?’ అని ప్రశ్నించారు.
510 అడుగుల నీళ్లున్నా ఎందుకిస్తలేవ్?
తాను సీఎంగా ఉన్నప్పుడు నాగార్జునసాగర్లో 495 అడుగుల నీళ్లు ఉన్నా నల్లగొండ, ఖమ్మంలోని పంటలకు నీళ్లు ఇప్పించినట్టు కేసీఆర్ తెలిపారు. ఒక్కసారి కూడా పంటలు ఎండిపోనివ్వలేదని పేర్కొన్నారు. పాలేరు ఎప్పుడూ మత్తడి దుంకేదని గుర్తుచేశారు. ఇప్పుడు 510 అడుగులకు నీళ్లు ఉన్నా, తాను హెచ్చరించినా పంటలు ఎండబెట్టారే కానీ నీళ్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
నేలకొండపల్లి మండలంలో పంటలు మొత్తం ఎండిపోయాయని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి చెప్పినట్టు తెలిపారు. భక్తరామదాసుకు ఏమైందని? అంత బ్రహ్మాండమైన ప్రాజెక్టు కట్టినా పంటలు ఎలా ఎండాయని అడిగితే, పాలేరు కూడా ఎండబెట్టారని, కరెంటు కూడా ఇస్తలేరని ఎన్నో పంటలు ఎండిపోయాయని తన దృష్టికి తీసుకొచ్చినట్టు వివరించారు.
రేవంత్.. ఇంకా ఎన్ని ఒట్లు?
డిసెంబర్ 9న ఉదయం 10 గంటలకు రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్రెడ్డి ప్రకటించారని, మరి అయిందా? అని కేసీఆర్ రోడ్షోకు హాజరైన వారిని ప్రశ్నించారు. దానికి వారు ‘కాలేదు..కాలేదు’ అని సమాధానమిచ్చారు. రుణమాఫీ చేయకపోగా భద్రాద్రి రామయ్య, బాసర సరస్వతి, యాదగిరి నర్సింహస్వామి మీద ఒట్లు పెడుతున్నాడని, ‘ఇంకా ఎన్ని ఒట్లు పెడతావ్ ముఖ్యమంత్రీ’ అని నిలదీశారు. ఇదే అంశంపై ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేయాలని హరీశ్రావు రాజీనామా పత్రం ఇచ్చాడని తెలిపారు. ‘రేవంత్రెడ్డి రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలని హరీశ్ డిమాండ్ చేసిండు. కానీ ముఖ్యమంత్రి గన్పార్క్కు పోలేదు. తోకముడిసిండు’ అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
ప్రజల వెతలు విన్న గులాబీ అధినేత
ఖమ్మం రోడ్షో కోసం వెళ్తూ మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ వద్ద కేసీఆర్ కొద్దిసేపు ఆగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, మహిళలతో మాట్లాడిన కేసీఆర్ ‘రైతుబంధు వచ్చిందా’ అని అడిగారు. ‘నాకు మూడెకరాలున్నాయి. రెండెకరాలల్ల వరి వేస్తే నీళ్లు రాక ఎకరం ఎండిపోయింది. కాల్వలో వారం రోజులే నీళ్లిచ్చిండ్రు. మార్చి మధ్యలనే ఆపడంతో పొలం ఎండిపోయింది’ అని గుగులోత్ జ్యోతి ఆవేదన వ్యక్తంచేసింది.
తుస్సుమన్న తులం బంగారం
కల్యాణలక్ష్మి పథకంలో భాగంగా కేసీఆర్ కేవలం రూ. లక్ష మాత్రమే ఇస్తున్నడు, తాము అధికారంలోకి వస్తే తులం బంగారం కూడా ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి నమ్మబలికారని, ‘మరి తులం బంగారం ఎవరికైనా వచ్చిందా?’ అని కేసీఆర్ ప్రశ్నించగా, ‘రాలే.. రాలే’ అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. రైతుబంధు గురించి అడిగితే ఓ కాంగ్రెస్ మంత్రి అహంకారంతో మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాల్వల్లోకి నీళ్లెందుకు రాలె?
నాడు పువ్వాడ అజయ్ నాయకత్వంలో ఖమ్మంలో లకారం చెరువు అభివృద్ధి చేశామని, మంచినీటి వ్యవస్థను బాగుచేశామని కేసీఆర్ పేర్కొన్నారు. ‘నేడు ఖమ్మంలో ఎన్నిరోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నయ్?’ అని ప్రశ్నించగా, ‘మూడు రోజులు’ అని ప్రజల నుంచి సమాధానం వచ్చింది. ‘మళ్లీ వాటర్ ట్యాంకర్లను కొనుక్కునే దుర్గతి ఇంత తొందర్లోనే ఎందుకు వచ్చింది? ఆ బాధలు ఎందుకొచ్చాయ్? నీళ్లు లేకనా, చేతగాకనా, చేవలేకనా, కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతనా? అనేది ప్రజలు ఆలోచించాలి’ అని కోరారు. మూడు నాలుగు నెలల్లోనే ఇవన్నీ మాయమైతయా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే జిల్లాలో వ్యవసాయశాఖమంత్రి, పక్కన నల్లగొండ జిల్లాలో నీటిపారుదలశాఖ మంత్రి ఉండి కూడా కాల్వల్లో నీళ్లు ఎందుకు రాలేదని నిలదీశారు. పాలేరు దగ్గర మేమే తూములను బద్దలు కొడతామని రైతులు ఎందుకు దండయాత్ర చేశారని, అటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయనేది యువకులు, ప్రజలు ఆలోచించాలని కోరారు.
ఇప్పటికీ నామీద రైల్వే కేసు ఒకటి ఉంది. కోర్టు ఇప్పటికీ రమ్మని నోటీసులు ఇస్తున్నది
-కేసీఆర్
రైతుబంధు కోసం యుద్ధం చేద్దాం
కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. తమకు రైతుబంధు రాలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కేసీఆర్.. ‘రైతుబంధు అందరికీ రాలేదా? పోరాడదమా? యుద్ధం చేద్దామా?’ అని ప్రశ్నించారు. ‘నాకు గుర్తు లేకపోయినా మీరు గుర్తు చేశారు’ అంటూ రైతులను అభినందించారు. ‘ఇప్పుడు కాంగ్రెస్ నాయకులొచ్చి రైతుబంధును ఐదు ఎకరాలకే ఇస్తమంటున్నరు. ఐదెకరాలు, ఏడెకరాలు ఉన్న రైతు కోటీశ్వరుడా? 20-25 ఎకరాలు ఉన్న వారికి రైతుబంధు ఇవ్వబోమంటే బాగుండేది. కనీసం పది ఎకరాల రైతులకు కూడా ఎగబెడదామంటే ఇంతకంటే దారుణం ఉంటదా?’ అని నిలదీశారు.
బీజేపీకి ఓటేస్తే గోదాట్లో వేసినట్టే
గతంలో ఏ ముఖ్యమంత్రీ ఖమ్మానికి ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదని కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఖమ్మానికి, కొత్తగూడేనికి రెండు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం జిల్లాకు కేంద్రం ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీకి ఓటు వేస్తే గోదాట్లో వేసినట్లేనని, కాంగ్రెస్కు ఓట్లు వేస్తే మళ్లీ గోసపడతారని హెచ్చరించారు. ఆవేశంతో కాకుండా, ఆలోచనతో ఓటు వేసి బీఆర్ఎస్కు శక్తిని ఇవ్వాలని కోరారు.
తులం బంగారం తుస్సుమన్నది. అడిగితే కాంగ్రెస్ కస్సుమంటున్నది. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతా అంటున్నది.
-కేసీఆర్
ఎన్టీఆర్ వచ్చాకే సంక్షేమం
గత ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని కేసీఆర్ విమర్శించారు. ‘ఎన్టీఆర్కు ముందు కాంగ్రె స్ వాళ్లు మస్తు చెప్పేది. దున్నేవానికే భూమి, తినేవానికే విస్తరి, గీసేవానికే గుండు, అమ్మను చూడు, ఆవుదూడ బొమ్మను చూడు అని చెప్పేది’ అని ఎద్దేవా చేశారు. కానీ ఈ రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ఎన్టీఆర్ వచ్చాకే ప్రారంభమైనదని పేర్కొన్నారు. ‘ఆ పుణ్యాత్ముడు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టెడన్నం దొరికింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. తుడిచేస్తే పోయేది కాదు.
ఆ మహనీయుడు వచ్చిన తర్వాతే పేదసాదలకు బుక్కెడు బువ్వ దొరికింది’ అని స్పష్టం చేశారు. పక్కా గృహాల నిర్మాణం, జనతా వస్ర్తాలు, భూమిశిస్తు రద్దు తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్టీఆర్ హయాంలోనే ప్రారంభమయ్యాయని గుర్తుచేశారు. నిజమైన సంక్షేమం ఎన్టీఆర్ కాలం నుంచే ప్రారంభమైందని, తెలంగాణ వచ్చాక ఎన్టీఆర్కు మించిన సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పారు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంటు, ధాన్యం కొనుగోలు తదితర కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా రైతుబీమా కింద వారం రోజుల్లో రూ. 5 లక్షలు ఇచ్చామని పేర్కొన్నారు.
పార్లమెంట్ అయిన తెల్లారే రేవంత్రెడ్డి బీజేపీలోకి వస్తాడని బీజేపీ వాళ్లు అంటున్నరు. ఎన్నికల తర్వాత ఎవడు ఎక్కడకి వెళ్తడో? ఏ పార్టీలో ఉంటడో తెలియని ఒక భయంకరమైన రాజకీయ అనిశ్చితి ఉంది. ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలను ఖండించలేదు.
-కేసీఆర్
నాడు వరికోతలు.. నేడు కరెంటు కోతలు
తొమ్మిదేండ్లు రెప్పపాటు పోకుండా అందిన కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైందని కేసీఆర్ ప్రశ్నించారు. ‘కరెంటు కోతలు ఉన్నయా?’ అని ప్రశ్నించగా ‘ఉన్నాయి.. ఉన్నాయి’ అంటూ ప్రజలు స్పందించారు. తాను మహబూబ్నగర్లో మాజీమంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో భోజనం చేస్తుంటే రెండుసార్లు కరెంటు పోయిందని గుర్తుచేశారు. తనను ఇబ్బంది పెట్టాలనో, లేక వాళ్ల అసమర్థత వల్లనో కరెంటు పోయిందని, ఈ విషయాన్ని తాను ట్విట్టర్లో పోస్ట్ చేశానని చెప్పారు.
దాన్ని చూసి ఈ జిల్లాకు చెందిన ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ‘కేసీఆర్ అబద్ధాలకోరు’ అని స్టేట్మెంట్ ఇచ్చారని, ‘ఆయన భట్టివిక్రమార్క కాదు.. వట్టి విక్రమార్క’ అని ఎద్దేవా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో కరెంటు కోతలు, నీటి కొరత కారణంగా హాస్టళ్లు మూసివేస్తున్నట్టు చీఫ్ వార్డన్ ఒక సర్క్యులర్ ఇచ్చారని, దాన్ని కూడా తాను ట్విట్టర్లో పెట్టినట్టు తెలిపారు. మహబూబ్నగర్, ఖమ్మంలోనే కాదు సాక్షాత్తూ ఉస్మానియా యూనివర్సిటీలోనూ కరెంటు, నీళ్లు లేవని తాను ట్విట్టర్లో పెట్టానని పేర్కొన్నారు. సర్క్యులర్ ఇచ్చిన ఆ చీఫ్ వార్డన్ను ఎందుకు సస్పెండ్ చేయకూడదో చెప్పాలని పేర్కొంటూ ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందని, ఆయనను సస్పెండ్ చేస్తారేమో కానీ, విద్యుత్ కోతలు మాత్రం నిజం కదా అని ప్రశ్నించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ మద్దతు లేకుండా వ్యవసాయం నడవని రోజులు కావడంతోనే రైతుబంధును సృష్టించినం. అశోక్గులాటీ అనే ఆగ్రో ఎకానమిస్ట్తో అనేక మాసాలు చర్చించి, మన రైతులను నిలబెట్టాలని రైతుబంధు, కరెంటు, నీటితీరువా మాఫీ, ధాన్యం కొనుగోలుతో ఆదుకున్నం.
-కేసీఆర్
నామా తపన రాష్ట్ర బాగు కోసమే
నా రాష్ట్రం బాగుపడాలనే ఉబలాటం ఉన్న వ్యక్తి నామా నాగేశ్వర్రావు అని, రాష్ట్ర బాగుకోసమే ఆయన తపిస్తుంటారని కేసీఆర్ పేర్కొన్నారు. ఆయన చాలా నిజాయితీపరుడని, వివాదరహితుడని ప్రశంసించారు. తన శక్తిమేరకు పనిచేసే ఆయనకే పెద్దస్థాయికి వెళ్లే అవకాశం ఉందని, కాబట్టి ఓటువేసి గెలపించాలని కోరారు. ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా అని, ఆలోచించి అందరూ నామాను గెలిపించి బీఆర్ఎస్కు బలమివ్వాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఫలితాలు వదిలేద్దామని, మళ్లీ విజృంభించి పోరాడదామని, అన్నింటినీ కాపాడుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామని కేసీఆర్ పిలుపునిచ్చారు.