హైదరాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): బుధవారం ఉదయం 10 గంటల 5 నిముషాలకు శాసనసభ ప్రారంభమైంది. సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్రావు లేచి.. కోరం లేదని, సభను ఎలా నడుపుతారని స్పీకర్ను ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిపోయారు. కోరం ఉన్నదని స్పీకర్ పేర్కొనడంతో లోపలికి వచ్చిన బీఆర్ఎస్ సభ్యులు.. తమకు మైక్ ఇచ్చి సహకరిస్తే ఉంటాం, మాటిమాటికి మైక్ కట్చేసి గొంతునొక్కే ప్రయత్నం చేస్తే వెళ్లిపోతామని హెచ్చరించారు.
కడియం శ్రీహరి మాట్లాడుతూ.. సభను కచ్చితమైన సమయానికి ప్రారంభించాలని, ఐదు, పది నిముషాలు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారని అన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు జోక్యం చేసుకొంటూ కోరంకు కావాల్సింది 12 మంది సభ్యులేనని, ప్రస్తుతం 18 మంది సభ్యులు ఉన్నారని వివరించారు.
గురువారం నుంచి కనీసం 40 మంది సభ్యులు ఉండేలా ప్రయత్నిస్తామని చెప్పారు. తలసాని జోక్యం చేసుకుంటూ, మంత్రి 18 మంది ఉన్నారని చెప్తున్నారని, కానీ 14 మందే ఉన్నారని పేర్కొన్నారు. కడియం మాట్లాడుతూ.. బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆర్థికమంత్రి, ముఖ్యమంత్రి సభలో లేరని, దీనిని బట్టి ప్రభుత్వం బడ్జెట్పై సీరియస్గా లేదని అర్థమవుతున్నదని విమర్శించారు. అనంతరం ఆయన బడ్జెట్పై చర్చను ప్రారంభించారు.