అమరచింత, మే 2 : తెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన కొనసాగుతున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి విమర్శించారు. రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయాలని అడిగిన వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. వనపర్తి జిల్లా ఆత్మకూర్ మండల కేంద్రంలో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు శనివారం రైతులతో కలిసి పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం మాట్లాడుతూ.. సీఎం రేవంత్రెడ్డి కనీసం రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడం లేదని విమర్శించారు. అప్పు చేసి పంటను పండించిన రైతులు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, మరోపక్క ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో దళారులకు పంటను విక్రయించి నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఆలింపూర్లో అన్నదాతల రాస్తారోకో

ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఆలింపూర్లో శనివారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిపై రైతులు ఆందోళన కొనసాగించడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కేంద్రాలకు లారీలు వచ్చేదాక ఆందోళన విరమించబోమని భీష్మించారు. కలెక్టర్, తహసీల్దార్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఎస్సై శ్రీకాంత్ వచ్చి లారీలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. కాగా బచ్చన్నపేట మండలం తమ్మడపల్లిలోనూ రైతులు ఆందోళన నిర్వహించారు. –బచ్చన్నపేట
దొడ్డు రకం ధాన్యం కొనాలని ఆందోళన

దొడ్డు రకం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు నిజామాబాద్ జిల్లా మోపాల్ మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేపట్టారు. ధాన్యం కోసి, ఆరబెట్టి పక్షంరోజులు దాటినా కాంటా వేయడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. దొడ్డు రకం ధాన్యాన్నిరైస్మిల్లర్లు తీసుకోవటం లేదని, కాంటా వేయడం లేదని అన్నారు. తమ ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రోడ్డు మీదనే మానవహారం చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో రేవంత్రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. – ఖలీల్వాడి
కొనుగోలులో జాప్యంపై కన్నెర్ర

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిజామాబాద్ గ్రామంలోని ప్రధాన రహదారిపై బైఠాయించారు. కేంద్రంలో ధాన్యం పోసి నెలరోజులైనా పట్టించుకునే వారే కరువయ్యారని మండిపడ్డారు. ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అధికారులు, ప్రజాప్రతినిధులు మళ్లీ ఇటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.సుమారు గంటపాటు రోడ్డుపై బైఠాయించారు. ఏఎస్సై తిరుమలబాబు అధికారులతో ఫోన్లో మాట్లాడించి రైతులను శాంతింపజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. – కోనరావుపేట
గన్నీ బ్యాగుల కోసం ఎగబడ్డ రైతులు

నారాయణపేట జిల్లా ఉమ్మడి మాగనూరు మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గన్నీ బ్యాగులు అరకొరగా సరఫరా అవుతున్నా యి. పంట కోసి నెలరోజులైనా బ్యాగులు అందజేయడంలో ఐకేపీ, పీఏసీఎస్ సిబ్బంది విఫలమవుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఒక్కో కేంద్రానికి కనీసం 5వేల గన్నీబ్యాగులు అందజేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 25శాతం మాత్రమే అందించారు. శనివారం వర్కూర్ కేంద్రానికి లారీలో గన్నీ బ్యాగులు రావడంతో రైతులు ఎగబడి తీసుకున్నారు. బ్యాగులు దొరకని వారు సమీపంలోని రైస్మిల్లులో పాత సంచులను తీసుకెళ్లారు.
మాగనూర్పెర్కిట్లో రాస్తారోకో

ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు శనివారం రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా పెర్కిట్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. కేంద్రాన్ని ప్రారంభించి 15 రోజులైనా కొనడం లేదని మండిపడ్డారు. కాంటా వేయడంలో జాప్యం జరుగుతున్నదని, తూకం వేసిన ధాన్యాన్ని తరలించడంలో ఆలస్యమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. – ఆర్మూర్టౌన్