హైదరాబాద్ : గతంలో ఎల్ఆర్ఎస్(LRS) వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. నాడు అడ్డగోలుగా మాట్లాడిన నేటి కాంగ్రెస్ మంత్రులు, ఇప్పుడు నోరు ఎందుకు విప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎల్ఆర్ఎస్ అంటే ప్రజల నుంచి డబ్బులు దోచుకోవడమే అన్న కాంగ్రెస్ నేతలు..ఇప్పుడు ప్రజల నుంచి ఎందుకు డబ్బులు దోపిడీ చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ను నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన(BRS protests) కార్యక్రమాలు చేపట్టారు. ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తించారు. నాడు ఇచ్చిన హామీ మేరకు ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేశారు. ఉచితంగా అమలు చేసే వరకు ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడుతామని నినదించారు.