Singareni | హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం సింగరేణి సంస్థను పూర్తిగా ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలన్న కుట్రలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారక రామారావు మండిపడ్డారు. తాజాగా సింగరేణిలోని బొగ్గు గనులను వేలం వేయాలని కేంద్రం మరోసారి నిర్ణయం తీసుకోవటంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. శనివారం మంచిర్యాల, భూపాలపల్లి, రామగుండం కేంద్రాల్లో సింగరేణి కార్మికులతో కలిసి పెద్దఎత్తున మహా ధర్నాలు నిర్వహిస్తామని ప్రకటించారు. సింగరేణి ప్రాంతంలోని జిల్లాల బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో కేటీఆర్ గురువారం ప్రత్యేకంగా మాట్లాడారు.
సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, కేంద్రం కుట్రపూరితంగా గనుల వేలం ప్రక్రియను మరోసారి తెరపైకి తెచ్చిందని విమర్శించారు. ఇప్పటికే పలుమార్లు గనుల వేలం కోసం ప్రయత్నం చేసినా ప్రైవేటు కంపెనీల నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఇవే గనులను నేరుగా సింగరేణికి కేటాయించాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్నా కేంద్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులు, తెలంగాణ ప్రజలు ఏకకంఠంతో సింగరేణి కోసం ప్రత్యేకంగా గనులు కేటాయించాలని కోరినా, పట్టించుకోకుండా సత్తుపల్లి బ్లాక్ 3, శ్రావణపల్లి, పెనగడప గనుల వేలం కోసం కేంద్రం మరోసారి నోటిఫికేషన్ ఇ చ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 29 నుంచి మే 30 వరకు ఈ గనులకు వేలం ప్రక్రియను నిర్వహించాలని కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని వెంటనే వెనకి తీసుకోవాలని, వేలం తో సంబంధం లేకుండా సింగరేణికి నేరుగా గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూడా గనులు కేటాయించకుండా సంస్థను దివాలా తీయించిన కేంద్రం, అదే విష ప్రయోగాన్ని సింగరేణిపై అమలు చేయాలని చూస్తున్నది. పోరాటాల పురిటిగడ్డ అయిన తెలంగాణలో ఎట్టిపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకొని తీరుతాం.
– మంత్రి కేటీఆర్
కొంగు బంగారాన్ని కొల్లగొట్టే కుట్ర
సింగరేణి ఒక కంపెనీ మాత్రమే కాదని, తెలంగాణకు కొంగు బంగారమని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణను దెబ్బ కొట్టాలన్న దురుద్దేశంతోనే కేంద్రం పదేపదే సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు కొనసాగిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికే సింగరేణి ప్రైవేటీకరణ ప్రయత్నాలను బీఆర్ఎస్ తరఫున, తెలంగాణ ప్రభుత్వ పక్షాన తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తు చేశారు. సింగరేణికి అవసరమైన బొగ్గు గనులను నేరుగా కేటాయించాలని సీఎం కేసీఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని తెలిపారు. ఇప్పటికే లాభాల్లో నడుస్తున్న అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా అమ్మేస్తున్న కేంద్రం, సింగరేణిని కూడా తెగనమ్మాలని కంకణం కట్టుకున్నదని ఆరోపించారు. లాభాల్లో ఉన్న సింగరేణికి బొగ్గు గనులు కేటాయించకుండా నష్టాల బాట పట్టించాలనే కుట్రలో భాగంగానే కేంద్రం పావులు కదుపుతున్నదని దుయ్యబట్టారు.
విశాఖలా విషప్రయోగం తెలంగాణ గడ్డపై కుదరదు
ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్కు కూడా గనులు కేటాయించకుండా సంస్థను దివాలా తీయించిన కేంద్రం, అదే విష ప్రయోగాన్ని సింగరేణిపై అమలు చేయాలని చూస్తున్నదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పోరాటాల పురుటిగడ్డ అయిన తెలంగాణలో ఎట్టపరిస్థితుల్లోనూ కేంద్ర ప్రభుత్వ కుట్రలను అడ్డుకొని తీరుతామని తేల్చి చెప్పారు.
మాట తప్పిన మోదీ
సింగరేణిని ప్రైవేటీకరించబోమంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనలన్నీ కల్లబొల్లి మాటలేనని తేలిపోయిందని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 2022 నవంబర్ 12న రామగుండం పర్యటన సందర్భంగా ఆయనే స్వయంగా సింగరేణి బొగు ్గగనులను ప్రైవేటీకరించబోమని మాట ఇచ్చారని, ఆ మాటను నిలుపుకోలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని హామీకే దికులేకపోతే ఎలా అని ప్రశ్నించారు. ప్రధాని మరోసారి రాష్ట్రానికి రాబోతున్న తరుణంలో సింగరేణిపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. అటు ఉత్పత్తిలోనూ, లాభాల్లోనూ, పీఎల్ఎఫ్ (ప్లాంట్ లోడ్ ప్యాక్టర్)లోనూ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న సింగరేణిని ప్రయివేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందో చెప్పే దమ్ము కేంద్ర ప్రభుత్వంలో ఏ ఒకరికైనా ఉన్నదా? అని నిలదీశారు.
ఉచిత కరెంట్ ఆపాలనే కుట్ర
సింగరేణి సంక్షోభంలోకి వెళితే దక్షిణ భారతదేశ థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి వ్యవస్థ కుప్పకూలుతుందనే సంగతి ప్రధానికి తెలియదా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. సింగరేణి ప్రైవేటీకరణ కేవలం ఆరు జిల్లాల సమస్య కాదని, సమస్త తెలంగాణ అంశమని అన్నారు. రాష్ట్ర ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే భారీ కుట్రలో భాగంగానే ఇది జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలోని రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు అందిస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పాన్ని ఎలాగైనా దెబ్బతీయాలన్న కుట్ర ఇందులో దాగి ఉన్నదని ఆరోపించారు. బోర్లపై ఆధారపడ్డ అన్నదాతల బతుకులు మళ్లీ బోర్లాపడేలా చేయాలన్నదే బీజేపీ దురుద్దేశమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న గుర్తింపు, గౌరవాన్ని చూసి కేంద్ర ప్రభుత్వం ఓర్వలేకపోతున్నదని ఆరోపించారు. విద్యుత్తు ఉత్పత్తిని దెబ్బతీసి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కరెంట్ లేకుండా చేయాలని కేంద్రం కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్ర థర్మల్ పవర్ జనరేషన్లో సింగరేణి పాత్ర అత్యంత కీలకమైనదని.. వ్యవసాయరంగానికి, పరిశ్రమలకు, గృహ అవసరాలకు 24 గంటలపాటు ఇస్తున్న నాణ్యమైన విద్యుత్తు సరఫరాను అడ్డుకోవాలన్న దురాలోచనతోనే కేంద్రం సింగరేణిపై కక్ష కట్టిందని విమర్శించారు. రైతులతోపాటు రాష్ట్రంలోని దళిత, గిరిజన, కులవృత్తులకు ఉచిత విద్యుత్తు ఫలాలు అందకుండా చేయాలని కేంద్రం చూస్తున్నదని ఆరోపించారు. ఉచిత పథకాలను అనుచితాలని స్వయంగా ప్రధానమంత్రి ప్రకటించడం ఆయనకు పేద ప్రజలపై ఉన్న కక్షపూరిత వైఖరిని వెల్లడిస్తున్నదని దుయ్యబట్టారు.
వేలం ఆపకపోతే మరో మహోద్యమమే
తెలంగాణకు సింగరేణి ఒక ఆర్థిక, సామాజిక జీవనాడిలాంటిదని మంత్రి కేటీఆర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణపై కేంద్రప్రభుత్వం వెనకి తగ్గకుంటే జంగ్ సైరన్ మోగిస్తామని, మరో ప్రజా ఉద్యమం నిర్మిస్తామని హెచ్చరించారు. సింగరేణిని ప్రైవేటీకరించే కేంద్రం కుట్రలు ఫలిస్తే తెలంగాణ రాష్ట్రం చీకటిమయం అవుతుందని, సింగరేణి కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతారని, వారసత్వ ఉద్యోగాలు, ఉద్యోగ భద్రత, నియామకాల్లో రిజర్వేషన్లు, బోనస్లు, అలవెన్సులు ఇతర సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా రద్దవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారని, వారికి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి అండగా ఉంటున్నదని కేటీఆర్ గుర్తుచేశారు. గతంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సింగరేణి నుంచే ఉవ్వెత్తున ఎగిసి గమ్యాన్ని ముద్దాడిందని గుర్తుచేశారు. ఈ సారి పురుడుపోసుకునే మహోద్యమంతో కేంద్ర ప్రభుత్వం కుప్పకూలక తప్పదని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
గుజరాత్కో నీతి.. తెలంగాణకో నీతా?
సింగరేణి ప్రైవేటీకరణ విషయంలో దాగుడుమూతలు ఆడుతున్న కేంద్రం పైకి ఒకమాట చెప్తూ, లోపల కుట్రకు తెరలేపుతున్నదని కేటీఆర్ మండిపడ్డారు. ఇదే కేంద్ర ప్రభుత్వం గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నామినేషన్ పద్ధతిన భారీగా లిగ్నైట్ గనులు కేటాయించిందని తెలిపారు. గుజరాత్ మాదిరిగానే తెలంగాణలోని సింగరేణికి బొగ్గు గనులను కేటాయించాలని ఎన్నోసార్లు తమ ప్రభుత్వం కోరినప్పటికీ మోదీ సర్కారు పెడచెవిన పెట్టిందని ఆరోపించారు. తన సొంత రాష్ట్రం గుజరాత్పై అపార ప్రేమను కనబరుస్తున్న దేశ ప్రధాని, ప్రగతిశీల తెలంగాణ రాష్ట్రం పట్ల మాత్రం వివక్ష చూపిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.