హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): దళితులను సీఎం జగన్ సర్కార్ మోసం చేసిందని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారిమళ్లించారని ధ్వజమెత్తారు. గురువారం ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన వైసీపీ దళిత నాయకులు శరత్ వర్దనపు , సురేశ్ వర్దినేటి, మధుకర్ తదితరులు చంద్రశేఖర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైసీపీ పాలనలో ఏపీలో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు. వైసీపీ సరారుపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదని, శాసనమండలి ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. రానున్నకాలంలో ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషించనున్నదని తోట చంద్రశేఖర్ తెలిపారు.