KCR | హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): తాము రైతుబంధు కోసం జమ చేసి ఉంచిన రూ.7,000 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తమ కాంట్రాక్టర్లు, తాబేదార్లకు ఇచ్చారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు విమర్శించారు. రైతుబంధు సాయం ఇవ్వకపోవడంతో రైతులు చక్రవడ్డీకి ప్రైవేటు వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇంకా పూర్తిస్థాయిలో రైతులందరికీ రైతుబంధు సాయం ఇవ్వలేదని, తాము అధికారంలో ఉన్నప్పుడు అదును మీద డబ్బులు వేశామని, అవి రైతులకు ఉపయోగపడ్డాయని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ రాష్ట్రం కావాలని తాము దీక్ష పట్టినమని చెప్పారు.
శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. ‘అశోక్ గులాటీ అనే ఆలిండియా ఎకనామిస్ట్తో ఆర్నెల్లు చర్చలు చేసి, రైతులకు మంచి చేయాలంటే ఏం చేయాలని అడిగితే ఒకటే మంచి సలహా చెప్పిండు. కేసీఆర్ గారు.. ఒకటే మాట, మీ ప్రభుత్వానికి ఎంత శక్తి ఉన్నదో నాకు తెలియదు, రైతులకు అన్ని దేశాల్లో ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తయి, రైతుకు సపోర్ట్ ఉంటేనే నిలబడే పరిస్థితి ఉంటది. పంటల ధరలు ఎక్కువ, తక్కువ అవుతాయి, వాతావరణ పరిస్థితులు ఒక్కోసారి కలిసిరావు. రకరకాల అరిష్టాలు ఉంటాయి. రైతు నిలబడాలంటే అప్పు తీసుకోని పరిస్థితికి రావాలి. జేబుల నాలుగు పైసలు జమ కావాలి.
చాలా మంది రైతులు చక్రవడ్డీకి అప్పులు తీసుకున్నరు. మీ తెలివి తక్కువతనం వల్లనే. మీరు రైతుబంధు డబ్బులు వేయకపోవడం వల్లనే. ఎప్పుడు వేస్తరో, వెయ్యరో చెప్పకపోవడం. మూడెకరాలు, ఏడెకరాలని రైతులను కన్ఫూజన్లో పెట్టినరు.
-కేసీఆర్
సొంత పెట్టుబడి పెట్టుకొని కాళ్ల మీద నిలబడే పరిస్థితి ఉండాలని, రైతుల దరిద్రం పోవాలంటే ప్రభుత్వం సాయం చేయాలని చెప్పిండు. ఆ టైంలో చాలా చర్చలు జరిగినయి. యూరియా బస్తాలు కొనిద్దామా అని నేను కూడా అన్నాను. ఈ విషయాన్ని పత్రికలు కూడా రాశాయి. కానీ అశోక్ గులాటీ గారు నాకు చెప్పింది ఏమిటంటే, సార్, నీవు యూరియా బస్తాలు ఇస్తే వానకాలం కోసం తెచ్చినవి మిగుల్తయి. వాటిని అమ్ముకోవాల్సి వస్తది. వాటిని అమ్మారు అనే బద్నాం అవుతారు. అది కాదు, నీవు ఎన్ని డబ్బులు ఇవ్వదల్చుకున్నావో, ఎకరానికి ఇంత అని లెక్కగట్టి డబ్బు సాయం చేయమని చెప్పారు.
‘రైతుబంధు.. చరిత్రలో ఎవ్వరూ వేయలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు. చరణ్సింగ్, దేవీలాల్, మహారాష్ట్రలో వసంత్ దాదాపాటిల్.. వాళ్లు స్వయంగా రైతుబిడ్డలే అయినా వాళ్ల నోటి నుంచి ఈ మాటే రాలేదు.
-కేసీఆర్
సంవత్సరానికి ఎకరానికి రైతుబంధు కింద 10 వేలు మంచి టైంకు వేసేవాళ్లం. అదును మీద వేద్దుం. రైతులు అప్పులు తీసుకునే పరిస్థితి ఉండకపోతుండే. కానీ ఇయ్యాల చాలా మంది రైతులు చక్రవడ్డీకి అప్పులు తీసుకున్నరు. మీ తెలివి తక్కువతనం వల్లనే. మీరు రైతుబంధు డబ్బులు వేయకపోవడం వల్లనే. ఎప్పుడు వేస్తరో, వెయ్యరో చెప్పకపోవడం. మూడు ఎకరాలు, ఏడు ఎకరాలు అని రైతులను కన్ఫూజన్లో పెట్టినరు.
మేము జమ చేసిన 7 వేల కోట్లను మీరు కాంట్రాక్టర్లకు, తాబేదార్లకు ఇచ్చా రు. రైతుల నోట్లో మట్టికొట్టారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పుకు డబ్బులు తెచ్చుకున్నరు. ఇయ్యాళ రైతులు ఘోరం గా మునిగిపోయారు. దీనికి ఏవ్వడు జిమ్మేదారి. తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండమైన, బలమైన వ్యవసాయ రాష్ట్రం కావాలని దీక్ష పట్టినం, ఒక పట్టు పట్టినం. వాళ్లకు ఐదారు రకాల వసతులు కల్పించినం’ అని కేసీఆర్ చెప్పారు.
ఆనాడు చెట్టుకొకరు గుట్టుకొకరు రైతులు ఆగమయ్యారు. గ్రామాలు వదిలిపెట్టి, వల్లకాడులాగా చేసి ఆటో రిక్షా నడపడానికి, బిల్డింగ్లలో పనిచేయడానికి పోయిన రైతులను తిరిగి వాళ్ల గ్రామాలకు వచ్చేటట్టు చేసినం. చిన్న, పెద్ద అన్నిరకాల రైతులను ఆదుకున్నం.
-కేసీఆర్