BRS Plenary | మెరుగైన మౌలిక వసతుల కల్పనే దేశాభివృద్ధికి సోపానమని, ప్రపంచంతో పోలిస్తే మనదేశంలో మౌలిక వసతుల కల్పన ఆశించిన జరుగడం లేదని అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో ‘దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బీఆర్ఎస్ ఉద్యమ స్ఫూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం’ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రహదారుల నుంచి విమానాశ్రయాలు, నౌకాశ్రయాల దాకా అన్నింటా వెనకబాటే. ఏ ప్రమాణంలో చూసినా మన దేశంలోని మౌలిక వసతులు చాలా తక్కువస్థాయిలో ఉండడం బాధాకరం. భారతదేశంలో జాతీయ రహదారులపై వాహనాల సగటు వేగం కేవలం 50 కిలోమీటర్లు మాత్రమే ఉన్నది.
జపాన్, సౌత్ కొరియాలాంటి దేశాల్లో 80 కిలోమీటర్లు, బ్రిటన్, అమెరికాల్లో 95 నుంచి 115 కిలోమీటర్లుగా ఉన్నది. భారతదేశంలో రైలు సగటు వేగం గంటకు 36 కిలోమీటర్లయితే, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రైలు సగటు వేగం 80కిలోమీటర్లు. ఇండియాలో సగటు కారు స్పీడు పాకిస్తాన్ కంటే తక్కువ స్థాయిలో ఉన్నది. 162 దేశాల్లో మనది 127వ స్థానం.. గూగుల్ మ్యాప్ వాళ్లు ప్రపంచవ్యాప్తంగా రూట్ మ్యాప్ ట్రావెలింగ్ టైమ్ తెలుసుకోవడానికి చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. రోడ్డు రవాణాలో అంతర్జాతీయ సగటు ట్రక్కు స్పీడ్ 105 కిలోమీటర్లు. మన దేశం ట్రక్కు స్పీడ్ కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే.
అంతర్జాతీయంగా గూడ్స్ రైలు స్పీడ్ను పరిశీలిస్తే చైనాలో 120 కిలోమీటర్లు ఉంటే.. అమెరికాలో 78 కిలోమీటర్లు. మన దేశంలో సగటు స్పీడు కేవలం 24 కిలోమీటర్లు మాత్రమే. 2022 సంవత్సరంలో చైనాలోని పోర్టులు హ్యాండిల్ చేసిన కార్గో కంటెయినర్ల సంఖ్య 210 మిలియన్లు. సింగపూర్ పోర్టులు నిర్వహించిన కంటెనర్ల సంఖ్య 37.3 మిలియన్లు కాగా, మన దేశంలోని పోర్టులు నిర్వహించిన కంటెయినర్ల సంఖ్య కేవలం 25.7 మిలియన్లు మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా భారతదేశంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు బీఆర్ఎస్ అద్భుతమైన ప్రణాళికలను రచిస్తున్నది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే దేశంలో భారీస్థాయిలో అద్భుతమైన మౌలిక వసతుల కల్పన జరిపించాలని ఈ సభ తీర్మానిస్తున్నది’ అని పేర్కొన్నారు.