ధర్మపురి, ఏప్రిల్ 11: రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తంగా మారిందని, నాలుగు నెలల్లోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. ముస్లింలంటే చిన్నచూపు చూస్తున్నదని, రంజాన్ పండుగ వేళ కనీసం తోఫాలు కూడా ఇవ్వరా? అని మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అన్ని మతాలను సమానంగా చూసి, ముస్లింలకు పెద్దపీట వేసి, అండగా నిలిచిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. గురువారం ఆయన జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగు నీరు ఇవ్వకుండా, రైతుబంధు, రుణమాఫీ, పంటకు రూ.500 బోనస్ హామీలను గాలికొదిలేసిందని విమర్శించారు.
కేసీఆర్ పాలనలో టెయిల్ ఎండ్ ప్రాంతాలకు కూడా సాగునీరందించినట్టు తెలిపారు. తమ హయాంలో ఎక్కడా ఎకరం కూడా ఎండిన దాఖలాలు లేవని అన్నారు. ఏడాదికి 1.20 కోట్ల ఎకరాల్లో పంటలు పండించుకున్నామని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ పాలనలో సాగునీరందక యాసంగిలో 20 లక్షల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయని ఆవేదన చెందారు. రైతులు కన్నీరు పెడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే 209 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. గ్రామాల్లో తాగునీటి కష్టాలు నెల రోజుల నుంచే మొదలయ్యాయని విమర్శించారు. ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన రూ.200 కోట్ల నిధులను కాంగ్రెస్ సర్కారు రద్దు చేసిందని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, తాము చేసిన అభివృద్ధ్దిని చూసి భారీ మెజారిటితో గెలిపించాలని కోరారు.