Putta Madhu | తనను చంపేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. పదవీకాలం ముగిసిన వెంటనే గన్మెన్లను తొలగించి హతమార్చేందుకు పథకం రూపొందించారని సంచలన ఆరోపణలు చేశారు. మంథని ప్రజల ఆశీర్వాదంతో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్గా ఎదిగిన తనపై కాంగ్రెస్ నేతలు ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసి ప్రజల నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 2018, 2023లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసిన అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ నేతలు, రాబోయే ఎన్నికల్లో వారికి ఎదురు లేకుండా చూసేందుకు నన్ను భౌతికంగా లేకుండా చేసేందుకు యత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పాలన ఇసుక, మట్టి, బియ్యం మాఫియాకు కేరాఫ్గా మారిందని పుట్ట మధూకర్ నిప్పులు చెరిగారు. ‘ఎన్నికల ముందు తనపై అడ్డగోలుగా ఆరోపణలు చేశారు.. కానీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు దాటినా ఆధారాలు ఎందుకు చూపడంలేదు’? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో ఇసుక క్వారీలు ఆదాయ వనరులుగా ఉండేవని అన్నారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతూ అక్రమంగా క్వారీలు నడిపిస్తున్నారని ఆరోపించారు.