తెలంగాణ ఉద్యమంలో యావత్ జాతిని జాగృతం చేసేందుకు ఉద్యమనేతగా, టీఆర్ఎస్ అధినేతగా నాడు కేసీఆర్ ఎంచుకున్న అనేక రూపాల్లో బహిరంగసభలు కీలక భూమికను పోషించాయి. ఆ పరంపరలో 2001లో కరీంనగర్ సింహగర్జన మొదలు 2010 డిసెంబర్ 16న వరంగల్లో జరిగిన తెలంగాణ మహాగర్జన వరకు అనేక బహిరంగసభలు చరిత్రను సృష్టించాయి. వరంగల్ సభ ఏకంగా ప్రపంచ రికార్డునే సొంతం చేసుకోవడం బీఆర్ఎస్ ఘనతగా చెప్పుకోవచ్చు. నేడు దేశాన్ని మేల్కొలిపే లక్ష్యసాధనలో కేసీఆర్ అదే పంథాను ఎంచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందాక ఖమ్మం గడ్డపై ఈనెల 18న నిర్వహించే బహిరంగ సభ మరో చరిత్రకు వేదిక కానుంది. ఇక్కడి నుంచి కేసీఆర్ బీఆర్ఎస్ శంఖారావం పూరించనున్నారు.
హైదరాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): ప్రపంచంలో భారీ బహిరంగసభలు నిర్వహించడంలో బీఆర్ఎస్ పార్టీ ప్రపంచ రికార్డులనే తిరగరాసింది. ఆ స్ఫూర్తితో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చిన తరువాత ఈనెల 18న ఖమ్మం నగరంలో తొలిసారిగా భారీ బహిరంగసభను నిర్వహించనున్నారు. ఈ సభకు ఖమ్మం జిల్లా నుంచే కాకుండా సరిహద్దు జిల్లాల నుంచి జనం ప్రభంజనమై తరలిరానున్నారు. ఇక్కడి నుంచే కేసీఆర్ బీఆర్ఎస్ శంఖారావం పూరించనున్నారు. ఈ సభకు ముగ్గురు సీఎంలు సహా ఎందరో జాతీయ స్థాయి నేతలు రానున్నారు. జాతిని జాగృతం చేసేందుకు ఇప్పటికే కేసీఆర్ తన ఆలోచనా.. ఆచరణను దేశం ముందుంచారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం సభపై జాతీయ స్థాయిలోనూ ఆసక్తి, ఉత్కంఠ నెలకొన్నది.
బీఆర్ఎస్ జైత్రయాత్రకు జైకొట్టిన జనం
కరీంనగర్లో 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ సభ తర్వాత కొద్దిరోజులకే హన్మకొండ జూనియర్ కాలేజీ మైదానంలో నిర్వహించిన బహిరంగసభ కీలక మలుపు తిప్పింది. ఆ రోజే ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. స్థానిక సమరంలోకి అడుగు పెట్టబోతున్నామని పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఆ ఎన్నికల్లో పార్టీ విజయఢంకా మోగించి, తెలంగాణ ప్రత్యేక ఆకాంక్షను చాటింది. అలాగే 2003లో వరంగల్లో నిర్వహించిన ‘తెలంగాణ జైత్రయాత్ర’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగసభ తెలంగాణవాదాన్ని జాతీయస్థాయిలో బలంగా వినిపించింది. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం, ఆ పార్టీ నేతృత్వంలో ఏర్పాటైన కేంద్రంలోని యూపీఏ-1 ప్రభుత్వ కనీస ఉమ్మడి ప్రణాళికలో తెలంగాణ చోటు సాధించడం, రాష్ట్రపతి ప్రసంగంలోనూ తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చేలా చేసింది. మహబూబ్నగర్ జిల్లాలో నిర్వహించిన భారీ బహిరంగసభ అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టేలా చేసింది. భూపాలపల్లిలో నిర్వహించిన సభ కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి దోహదం చేసింది. టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను నాటి సీఎం వైఎస్సార్ కొనుగోలు చేసి తెలంగాణవాదం లేదని నిరూపించే కుట్ర చేసినప్పుడు 2007లో వరంగల్లోని ప్రకాశ్రెడ్డిపేటలో నిర్వహించిన తెలంగాణ విశ్వరూప సభ ‘నేతలు అమ్ముడుపోవచ్చు.. కానీ ప్రజలుగా తెలంగాణవాదానికే కట్టుబడి ఉన్నాం’ అని నిరూపించదలచుకున్న కేసీఆర్ సంకల్పం సుధృఢంగా నిలిచింది.
అధికారంలోనూ ఆత్మగౌరవ పతాక
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం 2017 ఏప్రిల్ 27న వరంగల్లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ 16వ వార్షికోత్సవం సందర్భంగా రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సహా ప్రాజెక్టుల రీడిజైనింగ్, ఆసరా పింఛన్లు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చేపట్టే చర్యలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. అలాగే 2018 సెప్టెంబర్ 2న కొంగర కలాన్లో నిర్వహించిన ప్రగతి నివేదన సభలో ఆత్మగౌరవ రికార్డు నెలకొల్పింది.
18న ఖమ్మం సభపై దేశవ్యాప్తంగా ఆసక్తి
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్ 2001, నవంబర్ 17న ఖమ్మంలో నిర్వహించిన ప్రజా గర్జన అక్కడి ప్రజల్లో తెలంగాణవాదాన్ని నూరిపోసింది. అలాగే ఈనెల 18న బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తరువాత తొలిసారిగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్వహించే భారీ బహిరంగసభపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. శిబూసోరెన్, అజిత్సింగ్, శరద్పవార్, దేవేగౌడ, రాందాస్, ఉమాభారతి, ముఫ్తీ మహమ్మద్ సయీద్, స్వామి అగ్నివేశ్ ఇలా ఎంతోమంది ప్రముఖులను సీఎం కేసీఆర్ నాడు తెలంగాణ గడ్డకు ఆహ్వానించారు. దేశం గుణాత్మకంగా అభివృద్ధి చెందాలని, గెలవాల్సింది పార్టీలు కాదని, ప్రజలు గెలవాలని సీఎం కేసీఆర్ కలగంటున్న స్వప్నానికి సాక్షులుగా నేడు ఖమ్మం సభకు ముఖ్యమంత్రులైన అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరాయి విజయన్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సహా దేశ నలుమూలల నుంచి వివిధ రాజకీయ పార్టీలు, వివిధ రంగాల నిపుణులు హాజరు కానున్నారు. జాతి ముఖచిత్రాన్ని మార్చేందుకు, సీఎం కేసీఆర్ దగ్గరున్న ప్రణాళిక? దానికి అనువైన కార్యాచరణ ఏమిటీ? వంటి పలు అంశాలపై ఉత్కంఠ.. ఆసక్తి నెలకొనడం విశేషం.
తెలంగాణ మహాగర్జన ప్రపంచ రికార్డు
యూపీఏ సరారు 2009 డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేసింది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమంతో యూటర్న్ తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణవాదం సత్తా చూపాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్లోని ప్రకాశ్రెడ్డిపేటలో 2010 డిసెంబర్ 16న నిర్వహించిన తెలంగాణ మహాగర్జన బహిరంగసభ ప్రపంచంలోనే టాప్ టెన్ జన సమీకరణల్లో ఒకటిగా రికార్డు సృష్టించింది. 1930లో గాంధీ నిర్వహించిన దండి ఉప్పు సత్యాగ్రహం, అమెరికాలో మార్టిన్ లూథర్ కింగ్ సభ ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద జనసమీకరణల జాబితాలో తెలంగాణ మహాగర్జన కూడా ఒకటని న్యూయార్ టైమ్స్ పత్రిక ప్రత్యేక కథనం ప్రచురించిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ సభల మైలురాళ్లు
2001
మే 17: కరీంనగర్ సింహగర్జన (జేఎంఎం నేత శిబూసోరెన్)
జూన్ 1: మహబూబ్నగర్ బహిరంగ సభ
జూన్ 2: నల్లగొండ బహిరంగ సభ
జూన్ 4: నిజామాబాద్ బహిరంగసభ
జూన్ 5: నిర్మల్లో బహిరంగసభ
నవంబర్ 17: ఖమ్మంలో ప్రజాగర్జన
2002
మార్చి 27: వికారాబాద్ శంఖారావం
అక్టోబర్ 28: భూపాలపల్లిలో బహిరంగ
సభ (ఈ సభ పర్యవసానం
గానే కాకతీయ థర్మల్
పవర్ ప్రాజెక్టు సాధన)
2003
జనవరి 6: సికింద్రాబాద్ జింఖాన గ్రౌండ్స్లో తెలంగాణ గర్జన
ఏప్రిల్ 27: వరంగల్లో తెలంగాణ జైత్రయాత్ర (దేవేగౌడ, అజిత్సింగ్)
జూన్ 30: చలో జగిత్యాల బహిరంగసభ
నవంబర్ 19: సంగారెడ్డిలో సింగూరు సింహగర్జన
నవంబర్ 21 :పాలమూరు సింహగర్జన
డిసెంబర్ 3: ఇందూరు సింహగర్జన
డిసెంబర్ 5: ఓరుగల్లు వీరగర్జన
డిసెంబబర్ 16: సిరిసిల్లలో కరీంనగర్ కదనభేరి
2004
డిసెంబర్ 11 : సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్స్లో భారీ బహిరంగసభ (అజిత్సింగ్, ముఫ్తీ మహమ్మద్ సయీద్, డాక్టర్ రాందాస్ అథవాలే, పీ రాందాస్ (పీఎంకే), డాక్టర్ కృష్ణన్ (ఎండీఎంకే) హాజరు.
2005
జులై 17 : వరంగల్లో బహిరంగసభ (శరద్పవార్)
2006
ఫిబ్రవరి 12 : భద్రాచలంలో పోలవరం గర్జన (శిబూసోరెన్)
2007
ఏప్రిల్ 27 : వరంగల్లో తెలంగాణ విశ్వరూప సభ
2008
ఫిబ్రవరి 19 : కరీంనగర్ పబ్లిక్ మీటింగ్
2009
అక్టోబర్ 21 : సిద్దిపేటలో ఉద్యోగ గర్జన
2010
జనవరి 31 : హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ముస్లిం జాక్ సమావేశం
ఫిబ్రవరి 7 : తెలంగాణ పొలికేక (స్వామి అగ్నివేశ్ హాజరు)
మే2 : పాలమూరు గర్జన
జులై 15 : సిద్దిపేట బహిరంగ సభ
డిసెంబర్ 16 : వరంగల్లో తెలంగాణ మహాగర్జన (స్వామి అగ్నివేశ్ హాజరు. వరల్డ్ టాప్టెన్ జన సభల్లో ఒకటిగా రికార్డు)