CM KCR | రంగారెడ్డి : తెలంగాణలో మళ్లీ మనమే గెలుస్తాం.. అందులో డౌటే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అనేక విజయాలు సాధిస్తూ ఇంత దూరం వచ్చిన ఈ రాష్ట్రాన్ని మనం బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోవాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని తుమ్మలూరులో నిర్వహించిన 9వ విడత హరితహారం కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని మరింత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం అని కేసీఆర్ పిలుపునిచ్చారు. అన్ని పనులు జరుగుతాయి. ఈ నియోజకవర్గానికి కృష్ణా నీళ్లు వస్తాయి. మహేశ్వరం దాకా మెట్రో రైలు ఆటోమేటిక్గా వస్తది. అటు బీహెచ్ఈఎల్.. ఇటు ఇక్కడి దాకా వస్తది. మళ్లీ మనమే గెలుస్తం.. అందులో డౌట్ లేదు. బ్రహ్మాండంగా మనమే ఉంటాం కాబట్టి.. ఒక పద్ధతిలో వచ్చే టర్మ్లో ఇవన్నీ సాధ్యం చేసుకుందామని మనవి చేస్తున్నాను అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఫారెస్టు డిపార్ట్మెంట్ వారు చాలా కష్టపడి మన కోసం అడవులను పెంచుతున్నారు అని కేసీఆర్ తెలిపారు. కానీ దుర్మార్గులు ఒక ఫారెస్టు అధికారిని దారుణంగా చంపేశారు. ఆ ఫారెస్టు అధికారి భార్యకు డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం కల్పించి, నియామక పత్రాన్ని అందజేశాం. కొంత డబ్బులు కూడా సాయం చేశాం. మనిషిని అయితే తేలేం. కానీ వారికి ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు హామీ ఇస్తున్నాను. మీ మీద దాడులు జరగకుండా ఉండేందుకు పోలీసు స్టేషన్ల మాదిరిగా ఫారెస్టు స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. ఒక 20 వరకు స్టేషన్లు అవసరం అవుతాయన్నారు. వాటిని వెంటనే మంజూరు చేద్దాం. ఫారెస్టు డిపార్ట్మెంట్ను పటిష్టం చేద్దాం. తెలంగాణలో భారీగా ఫల వృక్షాలు పెంచాలి అని కేసీఆర్ సూచించారు.
హరితహారంలో అనేక అద్భుతాలు జరిగాయన్నారు కేసీఆర్. తెలంగాణలో.. ప్రతి గ్రామంలో నర్సరీ, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకున్నాం. అర్బన్ పార్కులు కూడా రూపుదిద్దుకున్నాయి. ఈ విజయం మనందరి విజయం. ప్రజలకు అవసరమైన పండ్ల మొక్కలను పంచేందుకు ఒక వంద కోట్ల బడ్జెట్ అయినా పెట్టి ఫల వృక్షాలను పంచాలని నిర్ణయించాం అని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు. దివ్యాంగులను మానవత్వంతో ఆదుకుంటున్నాం. వారికి పెన్షన్లు పెంచాం. ప్రతి ఒక్కరికి అవసరమయ్యే పథకాలు పెట్టుకున్నాం. కులానికో, మతానికో, జాతికో సంబంధించి పథకాలను అమలు చేయడం లేదు. ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరినీ ఆదుకుంటున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయంలో, ధాన్యపు రాశులు పండించడంలో అలా అన్నింటిలో నంబర్ వన్గా ఉన్నాం అని కేసీఆర్ తెలిపారు.