హైదరాబాద్ : భక్తులందరీ సహకారంతో బల్కంపేట ఎల్లమ్మ ( Balkampet Yellamma ) కల్యాణం ఘనంగా నిర్వహించినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) అన్నారు. బుధవారం బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవాన్ని ఆయన శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల సమక్షంలో అమ్మవారి కల్యాణం అత్యంత వైభవంగా జరిగిందని చెప్పారు.

ఆలయ పరిసర ప్రాంత ప్రజలు, వివిధ శాఖల అధికారులు, రాజకీయ పక్షాలు ప్రతి ఒక్కరి సంపూర్ణ సహకారంతో నే అమ్మవారి కల్యాణం, రథోత్సవం జరిగిందని అన్నారు. అమ్మవారి దీవెనలతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయని చెప్పారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండి ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, ఆలయ ట్రస్టీ చైర్మన్ సాయిబాబా గౌడ్, ఈవో వినోద్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు హన్మంతరావు, నాయకులు ప్రవీణ్ రెడ్డి, అశోక్ యాదవ్, కరుణాకర్ రెడ్డి, కట్టా బలరాం, రాజేష్ ముదిరాజ్, గుడిగే శ్రీనివాస్ యాదవ్, పీయూష్ గుప్త, గిరి యాదవ్, సురేందర్ తదితరులు ఉన్నారు.