Telangana | తెలంగాణ శాసనసభకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిన సంగతి తెలిసిందే. ఇక మిగిలింది ఓట్ల లెక్కింపు మాత్రమే. ఓట్ల లెక్కింపునకు సమయం ఉండడంతో.. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు..? సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారా..? వంటి ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ప్రజల్లో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. ఇక ఎగ్జిట్ పోల్స్పై కూడా జనాలు దృష్టి సారించారు. పలు సర్వే సంస్థలు వివిధ రకాలుగా ఎగ్జిట్ పోల్స్ను వెల్లడించాయి. అధికార బీఆర్ఎస్ పార్టీనే హ్యాట్రిక్ కొట్టబోతుందని కొన్ని సర్వే సంస్థలు వెల్లడిస్తే, కాంగ్రెస్దే అధికారమని మరికొన్ని సంస్థలు వెల్లడించాయి. నిన్నటి నుంచి ఎగ్జిట్ పోల్స్ విషయంలో ప్రజలు ఊగిసలాటలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో సర్వే సంస్థ బీఆర్ఎస్దే మళ్లీ అధికారమని తేల్చేసింది. రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి భారత్ రాష్ట్ర సమితి అధికారం స్వీకరించబోతుందని హెచ్కేఎస్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ వెల్లడించింది.
అధికార పార్టీ బీఆర్ఎస్ 53 నుంచి 58, కాంగ్రెస్ 48-52, బీజేపీ 4-8, ఎంఐఎం 5-7, ఇతరులు 2 స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని హెచ్కేఎస్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ వెల్లడించింది. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన మాదిరిగానే ఈ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ రాష్ట్రంలో పాగా వేస్తుందని ఆ సర్వేలో స్పష్టం చేశారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నట్లు ఆ సర్వే చెప్పకనే చెప్పింది.
ప్రతి నియోజకవర్గంలో విభిన్న వర్గాల నుంచి స్పష్టమైన అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. ఈ అభిప్రాయాలపై సమగ్రంగా చర్చించి, అది పోలింగ్ బూత్లో అదే విధంగా కన్వర్ట్ అయిందనే అంశాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు చెందిన ప్రభావవంతమైన నాయకులతో చర్చించి, అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. ఆ అభిప్రాయాలను ఓటర్ల అభిప్రాయాలతో సరిపోల్చడం కూడా జరిగింది. ఇక ప్రీ పోల్ నుంచి ఎగ్జిట్ పోల్ వరకు ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ సర్వేను రూపొందించారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తిస్థాయి దృష్టి సారించి దాదాపు 8 నెలల పాటు విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవడం జరిగింది. అంటే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నిన్న పోలింగ్ ముగిసే సమయం వరకు పూర్తి స్థాయిలో గ్రౌండ్లో తిరిగి చేసిన సర్వే. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గంలో ఈ సర్వే సంస్థ ఒక వాలంటీర్ను కలిగి ఉండటం. వారు ఎప్పటికప్పుడు హెచ్కేఎస్ ప్రయివేటు లిమిటెడ్ సంస్థ నిర్వాహకులతో చర్చలు జరపడం, ఓటర్ల అభిప్రాయాలతో ఇతర అంశాలను ప్రధానంగా తీసుకొని ఈ సర్వేను వెల్లడించినట్లు సర్వే నిర్వాహకులు పేర్కొన్నారు. గతంలో జీహెచ్ఎంసీ, ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు హుజురాబాద్, మునుగోడు, దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా ఈ సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి.