సభ పెట్టి ఇక్కడి నుంచి చెప్తేనే ప్రజలకు అర్థమవుతుందని ఈ బహిరంగ సభ పెట్టానే తప్ప ఇది రాజకీయ సభ కాదు. ఇయ్యాల ఏ ఎలక్షన్ లేదు. పార్లమెంట్ ఎలక్షన్లు కూడా రెండు నెలలకో, మూడు నెలలో ఉన్నవి. నేను ఇయ్యాల వచ్చింది రాజకీయాల కోసం కాదు. కాబట్టి దయచేసి ఇయ్యాల మిమ్మల్ని కోరేది ఏమంటే.. మన హక్కుల మీద న్యాయమైన పోరాటానికి సిద్ధంగా లేకపోతే బొండిగ పిసికేస్తరు. మనకు న్యాయం జరుగదు. సభలో ఉన్నవాళ్లను, టీవీల్లో నా ఉపన్యాసం వింటున్నవాళ్లను దండం పెట్టి చెప్తున్నా. నేను మీ బిడ్డను. పదిహేనేండ్లు పోరాడి, చావు నోట్లో తలకాయపెట్టి, చివరకు చావుదల దాకా పోయి ఈ తెలంగాణ తెచ్చిన. అందుకే నాకు గర్జు ఉంటది, ఫిక ర్ ఉంటది. తండ్లాట ఉంటది. తెలంగాణ నాశ నం కావద్దనే తపన ఉంటది. దీన్ని అర్థం చేసుకుని, ఎప్పుడు యాక్షన్ కార్యక్రమాలకు పిలునిచ్చినా సిద్ధంగా ఉండాలె. ప్రభుత్వం దమననీతిని ఎండగట్టి చాలా చేయాల్సి ఉంటది.
మీకు దమ్ముంటే మేము చేసిన దానికంటే మంచిగా చేసి చూపించు.. కరెంటు మంచిగా ఇచ్చి చూపు. కరెంట్ విషయంలో ఇయ్యాల్నే ఇట్లా చేస్తే.. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఇస్తరా? అసెంబ్లీలోనే జనరేటర్లు తెచ్చిపెట్టిండ్రు అంతపాటి గనులు. ఎన్నోసార్లు నేను చెప్పిన.. మీరూ అసెంబ్లీలో విన్నరు. ఇదే నరేంద్రమోడీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలె అంటే.. నా తలకాయ పోయినా మీటర్లు పెట్టను అని చెప్పిన. ఇవ్వాల్సిన రూ.25 వేల కోట్లు ఇయ్యకపోయినా రైతుకు కరెంటు మీటర్లు పెట్టలేదు. ఏం చేయాలి ఇయ్యాల? కరెంటు మంచిగ ఇయ్యాలె. ఆ ముచ్చట లేదు. మంచినీళ్లు మంచిగా రావాలె. రాష్ట్రంలో చాలా తిప్పలవుతున్నది. పట్టించుకునే నాథుడు లేడు. ఇంత మాయ చేసి, బలాదూర్గా దిరుగుదామనుకుంటుడ్రా? తిరుగనియ్యం జాగ్రత్త, ప్రజలు ఎండగడుతరు.
మేడిగడ్డ కాడ ఏదైనా ఉంటే 250 లేదా 300 పిల్లర్లు ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక ఆటబొమ్మ కాదు. గోదావరి మీద మూడు బరాజ్లు ఉంటాయి. 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి. 1,500 కిలోమీటర్ల కాల్వ ఉంటది. 19 సబ్ స్టేషన్లు ఉంటాయి. 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు కాదట! రెండుమూడు పిల్లర్లు కుంగిపోయినయ్. నాగార్జునసాగర్లో కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టులో గేట్లు కొట్టుకు పోలేదా? మొ న్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు సక్కగా ఉండె నా? కొట్టుకు పోలేదా? ఏదన్నయితే సదరాలి. మంచిగ చేయాలి. మంచిగచేసి రైతులకు నీళ్లు ఇయ్యాలె కానీ మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పొతాం? అంటే ఇది రాజకీయమా? ఇది తెలివి అనిపించుకుంటదా? ఇవి కావు రాష్ట్ర ప్రజలకు కావాల్సింది. ఒకలు ఓడొచ్చు.. గెలువొచ్చు. అధికారం ఎవలకూ శాశ్వతం కాదు.
డబుల్ స్పీడ్తో మళ్లా అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం ఇట్లనే మాట్లాడాలా? ఈ పద్ధతే అనుసరించాలా? మేం అలా చేస్తే మీరు నశంలోకి కూడా మిగుల్తరా? ఈ అహంకారంతోని దుర్మార్గమైన విధానంతో ఉన్నారు. నదుల గురించి మీకు అవగాహన లేదు. అడిగే తెలివి, సంస్కారం ఉండొద్దా? అన్నా ఏం చేయాలె అని అడగొద్దా? పొన్నాల లక్ష్మయ్య, హరీశ్రావు ఉన్నరు. నేను ఉన్న, కడియం శ్రీహరి ఉన్నరు. నీళ్ల మీద పనిచేసిన వాళ్లు ఉన్నరు. ఎవ్వల్ని అడిగినా చెప్పి ఉండేవాళ్లం కదా? మీకు తెలివి లేకపోతే. అప్పజెప్పుడు, ఆగమవుడు, బడ్జెట్ ఆపి తీర్మానం పెట్డుడు ఏంది? నేను ఒక్కటే మాట చెప్తున్న.. సరే అసెంబ్లీలో తీర్మానం పెట్టిండ్రు కదా.. మళ్లీ నల్లగొండలో మీటింగ్ ఎందుకని అంటున్నరు. అసెంబ్లీలో తీర్మానంతో, నల్లగొండలో మీటింగ్తో అయిపోదు. కృష్ణానదిపై బ్రిజేష్ ట్రిబ్యునల్లో మనకు న్యాయపరమైన వాటా తేలేవరకు, మన నీళ్ల హక్కు మనకు దక్కేవరకు, ప్రతి సందర్భంలో కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ఐదు జిల్లాల ప్రజలు ఎప్పటికప్పుడు పోరాడటానికి సిద్ధంగా ఉండాలె.
నా తెలంగాణ రైతులు చెట్టకొకడు పుట్టకొకడు అయిండు. హైదరాబాద్కు పోయి ఆటోరిక్షా నడిపే గతి వచ్చింది. కాబట్టి ఒక దరికి రావాలె. పల్లెలు పచ్చబడాలె. రైతాంగం బాగుంటే అందరికీ పని దొరుకుతది. చిన్న రైతు, పెద్ద రైతు అందరూ బతకాలని చెప్పి రైతుబంధు ఇచ్చాం? రైతుబంధు ఎంత మంచిగా, బ్రహ్మాండంగా వచ్చేది. రైతులకు రైతుబంధు మీ బ్యాంకులో పడి టింగ్.. టింగ్ అని మీ ఫోన్ మోగుతుండె. ఇప్పుడు బ్యాంకులో పడుడు లేదు, ఫోన్ మోగుడు లేదు. ఏం మోగుతుందంటే.. రోజు అసెంబ్లీలో అరుపులు, పనికి మాలిన మాటలు. అంతేకదా? మీరందరూ చూస్తున్నరు కదా? మీరు ఏం భయపడకండి, ఏం కాదు. మళ్లా మనమే వస్తాం. అన్ని చేసుకుందాం. తెలంగాణను ఏం కానియ్యను. ఈ మధ్యలో కూడా వీళ్లు దుర్మార్గం చేస్తే కొట్లాడుదాం.. పోరాడుదాం. మన హక్కుల కోసం నిలబడుదాం.
నేను మీ అందరికీ ఒకే మాట చెప్తున్నా.. అధికారంలోకి రావాలె, ఎన్ని అబద్ధాలైన చెప్పుదాం అని నోటికొచ్చింది చెప్తున్నారు. ఇయ్యాల కొత్తగా మొదలు పెట్టిండ్రు దుకాణం.. పేపర్లలో, సోషల్ మీడియాలో చూసిన.. వరికి కనీస మద్ధతు ధర వస్తే రూ.500 బోనస్ ఇయ్యరట! అంటే ఏమన్నట్టూ..? ఆ నాడు ఎందుకు చెప్పినట్టు? మద్ధతు ధర రాలేదా? కేసీఆర్ ప్రభుత్వం వడ్లను కొనలేదా? డబ్బులు బ్యాం కులో పడలేదా? మరి ఇయ్యాల ఏమైంది?
కృష్ణా జలాల్లో, అటు గోదావరి జలాల్లో తెలంగాణ రాష్ర్టానికి రావాల్సిన సంపూర్ణమైన వాటా వచ్చేదాక బీఆర్ఎస్ కొట్లాడతది. ఇయ్యాల అసెంబ్లీలో తీర్మానం చేయ్యంగానే కాదు. ముఖ్యమంత్రి అన్ని పార్టీల నాయకులను ఢిల్లీకి తీసుకొని పోవాలె. ప్రధానమంత్రిని నిలదీయాలె. నదీ జలాల్లో మా వాటా మాకు వస్తే తప్ప ఊరుకోబోమని చెప్పాలి. వాళ్లు చెప్పేదాకా మనం కూడా వెంబడి పడాలె. ప్రజా ఉద్యమాలు ఉంటేనే ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉంటాయి. జాగ్రత్తగా ఉంటాయి. కాబట్టి ఈ దొంగనాటకాలు మానుకొని, పాలమూరు ప్రాజెక్టు ఎట్లా చేయాలో, మంచి కరెంటు ఎట్లా చేయాలో ఆలోచన చేయండి.
మీరు ఐదేండ్లు అధికారంలో ఉండండి. మాకు అభ్యంతరం లేదు. వాస్తవానికి కొట్లాడబట్డి 24 ఏైండ్లెంది. దమ్ము తీసుకోకుండా ఒక పూట రెస్ట్ లేకుండా చేసిన. సరే ఆపోజిషన్కు వచ్చిన కదా? కాసేపు ఆరాం తీసుకుందామనుకున్నా. కానీ ఏం చెసిండ్రు. ‘నల్లముఖం పిల్లిపోయి, సచ్చిపోయిన ఎలుకను పట్టిందట’ అన్న చందంగా గవర్నమెంట్కు వచ్చుడు వచ్చుడే కృష్ణా నీళ్లను కొంచపోయి కేఆర్ఎంబీకి కట్టబెట్టిండ్రు. కట్టమీద మొత్తం రిజర్వ్ పోలీసులు ఉన్నరు. మంచినీళ్లకు కూడా చిప్ప పట్టుకుని అడుక్కోవాలె. శ్రీశైలంలో కట్క ఆన్ చేసి కరెంటు ఉత్పత్తి చేయాలంటే, వాన్ని చిప్ప పట్టుకుని అడుక్కోవాలి.
మనకున్న అధికారాన్ని తొమ్మిదిన్నర ఏండ్లు నేను కాపాడిన. నన్ను కూడా బెదిరిచ్చిండ్రు. ఏ కేసీఆర్ మీ గవర్నమెంట్ను తీసేస్తాం.. రాష్ట్రపతి పాలన పెడుతామన్నారు. దమ్ముంటే పెట్టు చూద్దామన్నా. కానీ ప్రాజెక్టులు అప్ప చెప్పలే. నా మీద కూడా మస్తు ఒత్తిడి తెచ్చిండ్రు. ఎప్పటికప్పుడు లెటర్లు రాసుకుంటూ, బోధన చేసుకుంటూ.. పార్లమెంట్లో మన ఎంపీలు, మేము కొట్లాడి ఆపినం కానీ అప్పచెప్పలే. కానీ ఇయ్యాల వీళ్లు అప్ప చెప్పిండ్రు.
మొన్న మన ఎంపీలు నామా నాగేశ్వర్రావు, రంజిత్రెడ్డి, కేశవరావు పోయి అడిగిండ్రు. కేంద్ర మంత్రిని కలిసి కేఆర్ఎంబీ, నాగార్జున సాగర్ను ఎట్లా తీసుకుంటావ్? మా చేతుల్లో ప్రాజెక్టు మీరెట్లా తీసుకున్నరు అని అడిగితే.. మీ గవర్నమెంట్ వచ్చింది.. ఒప్పుకొని పోయిందని అన్నారు. మళ్లీ మీ బీఆర్ఎస్ వచ్చి ఇట్లా అంటున్నరు అని వాళ్లు అంటున్నరు. ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టిండ్రు. అందుకే నేను చెప్తున్నా.. ముఖ్యమంత్రిగాని, ఇరిగేషన్ మంత్రిగాని, రాష్ట్ర మంత్రివర్గంగాని, పిచ్చి ఆలోచనలు, పిచ్చి ప్రలాపాలు బంద్చేసి వెంటనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశం ముగించి, అఖిల పక్షాన్ని తీసుకొని వెంటనే ఢిల్లీకి పోవాలె. మాట్లాడాలె. బ్రిజేష్ ట్రిబ్యునల్ టైంఫ్రేమ్ పెట్టమనాలె. ఎన్నో సంవత్సరాల నుంచి అన్యాయం జరిగింది కాబట్టి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఆరు నెలల్లో ఆదేశాలు ఇచ్చేటట్టు కేంద్రంపై ఒత్తిడి తేవాలె. అధికారంలోకైతే వచ్చినం, మళ్లా ఐదేండ్ల నాటికి చూసుకుందాం అన్నట్టు వ్యవహారం చేస్తే ప్రజలు ఊరుకోరు. గర్జిస్తరు. నిలదీస్తరు. ఎక్కడికక్కడ నిలబెడ్తరు. ఇది మునుపటి ఎడ్డి తెలంగాణ కాదు. లేసిన తెలంగాణ. టైగర్ తెలంగాణ. ఒక ఆవాజ్ ఇస్తే లక్ష పిడికిళ్లు ఎత్తి పోరాటానికి సిద్ధంగా ఉన్న తెలంగాణ. కొట్లాడుదాం కదా? పోరాటం చెద్దామా? అని సభకు వచ్చిన అశేష జనవాహినని కేసీఆర్ ప్రశ్నించారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాకు కేసీఆర్ ఏమీ చేయలేదని కండ్లు లేని కబోధులు అంటున్నారు. అబద్ధాలతో కాలం గడుపుతూ ఊరకుక్కల్లా దాడులు చేసే వారికి అభివృద్ధి అంటే ఏం తెలుసు? కేసీఆర్ నల్లగొండకు వచ్చి ఏం చేశాడనే వెధవలకు సమాధానం ఏంటంటే.. మీరు పెంచి పోషించిపోయిన కరువును, ఆకలిచావులను, రెండున్నర లక్షల మందిని బలి తీసుకున్న ఫ్లోరోసిస్ను దూరం చేశారు. తెలంగాణ వచ్చే నాటికి ఉమ్మడి జిల్లాలో మూడు లక్షల టన్నుల ధాన్యం పండటమే మహా గగనం. బీఆర్ఎస్ పాలనలో నాలుగేండ్లలోనే నలభై లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. మీరు జిల్లాను ఖరాబ్ చేస్తే కేసీఆర్ వచ్చినంక మార్చాం. కాంగ్రెస్ పాలన వచ్చినంక జరిగిన మార్పు ఏమిటంటే 24 గంటల కరెంటు మాయం. ఉమ్మడి జిల్లాకు కేసీఆర్ పది లక్షల ఎకరాలకు సాగు నీళ్లు ఇస్తే వాటిని మాయం చేసి ఐదారు లక్షలకు తెచ్చారు. కేసీఆర్ ఏం తెచ్చారో ఒక్కసారి లెక్క లేసుకుంటే అర్థమవుతది. తెలంగాణ ఆత్మ ఉంటే కదా ఎవరికైనా అర్థమయ్యేది. రెండు నెలలుగా నాగార్జునసాగర్ అవతలోని చేతికి పోతే ఒక్కడైనా మాట్లాడలేదు. నాగార్జునసాగర్ను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ నల్లగొండలో కేసీఆర్ సభ పెడుతున్నారని ఒక్కొక్కడికి వణుకు పుట్టింది. కేఆర్ఎంబీ అంటే ఏమిటో తెలియక తికమక పడుతూ అర్థం పర్థం లేకుండా అబద్ధాలు చెప్పి హడావిడిగా అసెంబ్లీలో చర్చ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్వాకాన్ని హరీశ్రావు ఆధారాలతో ముఖం మీద కొట్టినట్టు చెప్పడంతో ఏదీ తోచక ఆరేడుగురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు నోరేసుకొని మాట్లాడి ప్రజల్లో చులకనయ్యారు. ఉద్యమం షురూ అయ్యింది. తస్మాత్ జాగ్రత్త! ప్రభుత్వం సక్రమంగా నడపండి.. మేం సహకరిస్తాం. తప్పులు చేస్తే తోడ్క తీస్తాం.
-మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి
నల్లగొండలో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతాంగంతో నిర్వహించిన ఈ సభ రాజకీయ సభ కాదు. ఇది దుఃఖం, బాధతో నిర్వహిస్తున్న సభ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే రైతులకు ఆనందం లేకుండా చేసింది. కృష్ణా జలాల హక్కులను కేంద్రానికి అప్పగించింది. నాడు హైదరాబాద్ను ఆంధ్రాలో కలిపి నల్లగొండ, పాలమూరు గోసకు కారణమైన కాంగ్రెస్ ఇవ్వాళ అంతకుమించిన మోసం చేసింది. నిజాం కాలంలోనే నల్లగొండ, పాలమూరు సస్యశ్యామలంగా ఉండేవి. తుంగభద్ర నది నుంచి గ్రావిటీ ద్వారానే 170 టీఎంసీలు వచ్చేవి. ఆంధ్రాలో కలుపకపోతే నందికొండ ఇంకా పైభాగంలో నిర్మాణం అయ్యేది. ఎడమకాల్వ అంత దిగువన ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్లగొండ, పాలమూరు జిల్లాల గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేస్తూ మరోవైపు మిషన్ కాకతీయ ద్వారా 46 వేల చెరువులను పునరిద్ధరించాం. డిండి ఎత్తిపోతల పథకంతోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు చేపట్టకుండా కేసులు వేసి ఆపింది నల్లగొండ కాంగ్రెస్ నేతలే. వారే ఆనాడు పులిచింతల ప్రాజెక్టులో కమీషన్లు మేసి, ఆ తర్వాత కాంట్రాక్టులు చేశారు. నేడు కృష్ణా జలాల హక్కులు అనేవి జీవన్మరణ సమస్యగా మారాయి. తొమ్మిదిన్నరేండ్లుగా నాన్చిన కేంద్రం మెడలు వంచాల్సిన అవసరం ఉన్నది. అదిమరిచి కృష్టా ప్రాజెక్టుల హక్కులను కేంద్రం చేతుల్లో పెట్టడం వల్లే నల్లగొండ సభ నిర్వహించాల్సి వచ్చింది.’
– మాజీ మంత్రి నిరంజన్రెడ్డి
మా దేవుడు కేసీఆర్ సారు. కరువు జిల్లాగా ఉండి వలసపోయిన మేము కేసీఆర్ సీఎం ఆయ్యాక బాగుపడ్డాం. ఆయన ఇంట్లో కాలుజారి పడిపోయాడని తెలిసి బాధపడ్డాం. మా బతుకులు మళ్లీ మొదటికే వస్తాయని భయపడ్డాం. తర్వాత ఆయన లేచి నడుస్తున్నాడని తెలిసి చూడాలని హైదరాబాద్కు వెళ్లిన. కానీ సెక్యూరిటీ కారణంగా చూడలేకపోయిన. నల్లగొండకు వస్తుండని తెలిసి కేసీఆర్ సారును చూసేందుకు మహబూబ్నగర్ జిల్లా నుంచి వచ్చిన. మా దేవుడు ఆరోగ్యంగా ఉన్నడు. మునపటి లెక్కే మాట్లాడిండు. నాకు ఆయన మాటలు విన్నాక నమ్మకం వచ్చింది. చుక్కనీరు కూడా పోనియడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉన్నది.
-మల్లెల బుచ్చాగౌడ్, తుంకినిపూర్, మూసాపేట మండలం, మహబూబ్నగర్ జిల్లా
నాకు నాలుగు ఎకరాల భూమి ఉన్నది. మొత్తం వరి పొలమే పెట్టిన. తొమ్మిదిన్నరేండ్ల నుంచి ఏటా రెండు పంటలు వేసిన. నీళ్లు, కరెంట్కు ఏ ఇబ్బందీ రాలే. రైతుబంధుతో ఎవరి సాయం లేకుండా పంటలు వేసిన. ఇప్పు డు కాంగ్రెస్ సర్కారు వచ్చింది నీళ్లు లేవు. బోర్లు ఎండిపోయినయి. పంట ఎండిపోతుంటే చూడలేక మనసు బాధపడి పదిహేను రోజుల కింద మరో బోరు వేసిన. వారం రోజులు పోసి అది కూడా అడుగంటిపోయింది. పొలం ఎండిపోయింది. రైతుబంధు కూడా రాలేదు. అప్పు చేసి పెట్టుబడి పెట్టిన. అది ఇప్పుడు అప్పుగానే మిగిలిపోయింది.
-గానూతల పెద్దులు, బోయినపల్లి, కనగల్ మండలం, నల్లగొండ జిల్లా