KCR | నల్లగొండ : రాజకీయాల్లో ఒకరు ఓడొచ్చు.. ఒకరు గెలవొచ్చు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. మళ్లా మేం డబుల్ స్పీడ్తో అధికారంలోకి వస్తాం. అప్పుడు మేం గిట్లనే మాట్లాడాలా..? ఈ పద్ధతిని అనుసరించాలా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. చలో నల్లగొండ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
నదుల నీళ్ల మీద నీకు అవగాహన లేదు. నన్ను అడిగితే నేను చెప్తుంటి. అడిగే సంస్కారం, తెలివి ఉండొద్దా..? అన్న గిట్ల అంటున్నరు.. కేఆఆర్ఎంబీకి అప్పజెప్పమంటున్నారు.. మమ్మల్ని ఎవరిని అడిగినా చెప్పేటోళ్లం కదా.. అప్పజెప్పడం, ఆగమావడం.. బడ్జెట్ ఆపి తీర్మానం పెట్టుడు ఇదేనా మీ తెలివి అని కేసీఆర్ నిలదీశారు.
అసెంబ్లీలో తీర్మానంతో, చలో నల్లగొండతో ఆగిపోదు.. కృష్ణా నదిలో న్యాయమైన వాటా తేలే వరకు ప్రతి సందర్భంలో ఈ ఐదు జిల్లాల ప్రజలు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. ప్రజలకు అర్థమైతదనే ఈ సభ పెట్టాను. ఇది రాజకీయ సభ కాదు. ఇవాళ ఏ ఎన్నికలు లేవు. పార్లమెంట్ ఎన్నిలకు రెండు నెలలు ఉంది. రాజకీయాల కోసం రాలేదు. ప్రజలు మన హక్కుల మీద న్యాయమైన పోరాటాలకు సిద్ధంగా లేకపోతే బొందిగే పీసికేస్తరు తప్ప మనకు న్యాయం జరగదు. అందుకే మీ అందరికి దండం పెట్టి చెబుతున్నా. నేను మీ బిడ్డను. 15 ఏండ్లు పోరాడి చావు నోట్లో తలకాయపెడితే చివరకు ఈ తెలంగాణ తెచ్చింది నేను. అందుకే నాకు తెలంగాణ మీద ఫికర్ ఉంటది. నాశనం కావొద్దనే తపన ఉంటుంది. ప్రభుత్వ దమననీతిని ఎండగట్టేందుకు ఎప్పుడు పిలిచినా.. రావాలి అని కేసీఆర్ అన్నారు.
రేపు చాలా చేయాల్సి ఉంటది. ఇప్పుడే కరెంట్ను ఇట్ల చేసిండ్రు.. రేపు, మార్చి, ఏప్రిల్, మే నెలలో కరెంట్ ఇస్తరా.? అసెంబ్లీలోనే జనరేటర్ తెచ్చిపెట్టిండ్రు.. అంతపాటి ఘనులు వీరు. ఇదే నరేంద్ర మోదీ ప్రభుత్వం మీటర్లు పెట్టాలి.. నా తలకాయి పోయిన సరే పెట్టను అని చెప్పాను. 25 వేల కోట్లు ఇవ్వలేదు. అయినా పెట్టలేదు. ఎందుకంటే నా తెలంగాణ రైతులు గుట్టకు ఒకడు, చెట్టుకు ఒకడు అయిండ్రు. హైదరాబాద్ పోయి ఆటో రిక్షాలు నడిపే గతివచ్చింది. కాబట్టి వీరు మళ్లీ ఒక దరికి రావాలి. రైతాంగం బాగుంటే పని దొరుకుతదని చెప్పి.. అన్నీ చేశాం. రైతుబంధు ఎంత మంచిగా వచ్చేది.. బ్యాంకులో పడి ఫోన్ టింగ్ టింగ్మని మోగుతుండే.. ఇప్పుడు బ్యాంకుల పడుట లేదు. ఫోన్ మోగడం లేదు. ఏం మోగుతుంద్రా అంటే.. రోజు అసెంబ్లీలో అరుస్తా ఉన్నారు.. పనికిమాలిన మాటలు.. మీరంతా చూస్తున్నరు కదా.. మీరేం భయపడకండి.. మళ్లా మనమే వస్తం. అన్ని చేసుకుందాం. ఏం కానివ్వం తెలంగాణను. ఈ మధ్యలో దుర్మార్గం చేస్తే కొట్లాడుదాం.. పోరాడుదాం.. మన హక్కుల కోసం నిలబడుదాం అని కేసీఆర్ ధైర్యం చెప్పారు.