ECI | హైదరాబాద్ : భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) ఢిల్లీలోని నిర్వచన్ సాధన్ ప్రధాన కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు దేశంలోని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి రావాలని బీఆర్ఎస్ పార్టీని కూడా ఈసీఐ అధికారంగా ఆహ్వానించింది.
ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో పార్టీ బృందం హాజరు కానుంది. కేటీఆర్తో పాటు రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కేఆర్ సురేశ్ రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్, మాజీ ఎంపీ బాల్క సుమన్, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరు కానున్నారు.
ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి ఈసీఐ కార్యదర్శి అశ్విని కుమార్ మొహాల్ ఒక అధికారిక లేఖలో కోరారు. ఈ ఆహ్వానాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ద్వారా బీఆర్ఎస్ అధ్యక్షుడికి కూడా పంపారు. మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఈ సమావేశంలో ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సంబంధిత అంశాలపై చర్చ జరిగే అవకాశముంది. పలు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.