సుల్తాన్పూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఉద్యమాల పురిటి గడ్డ మెతుకుసీమ మరోసారి తన బిడ్డ కేసీఆర్ వెంటే ఉన్నానని చాటిచెప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్కు సుల్తాన్పూర్ వేదికగా అపూర్వ స్వాగతం లభించింది. ఇటీవల కాలంలో కనీవిని ఎరుగనిస్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజాఆశీర్వాద సభకు హాజరై మీ వెంటే మేమున్నామంటూ కేసీఆర్కు నైతిక మద్దతు ఇచ్చిన దృశ్యం మంగళవారం ఆవిష్కృతమయ్యింది.
ఇసుకేస్తే రాలనంత మంది జనం సభకు హాజరయ్యారు. లక్ష మంది వస్తారని అంచనా వేసిన సభకు అంతకుమించే రావడం గమనార్హం. సభకు జనం రావడమే కాదు.. కేసీఆర్ ప్రసంగం పూర్తయ్యే వరకు ఆసక్తిగా కూర్చొనే ఉండడం గమనార్హం. సాయంత్రం నాలుగు గంటలకల్లా సభా ప్రాంగణానికి చేరుకున్న వారు.. సారు ప్రసంగించి వెళ్లేంత వరకు నేతల ప్రసంగాలు, కళాకారుల ఆటపాటలను ఆసాంతం విన్నారు. ఉమ్మడి జిల్లాలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన తొలి బహిరంగ సభ విజయవంతం కావడం పార్టీలో జోష్ నింపింది.
సభలో కేసీఆర్ తన ప్రసంగంలో ఏ అంశాలు ప్రస్తావిస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూశారు. కేసీఆర్ ప్రసంగం పూర్తయ్యే వరకు ప్రజలు కూర్చున్నచోట నుంచి లేవలేదు. తమ మనసులోని మాటలు కేసీఆర్ నోటి నుంచి రావడంతో ప్రజలు చప్పట్లతో మద్దతు తెలిపారు. రాష్ట్రంలో లిల్లీపుట్ పాలన అంటూ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పాలకుల గురించి చేసిన కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు అద్భుత స్పందన వచ్చింది. ‘మెదక్ జిల్లా రుణం తీర్చుకోలేను.. రెండు చేతులెత్తి మొక్కుతున్నా’ అంటూ కేసీఆర్ భావోద్వేగ పూరితంగా మాట్లాడినపుడు సభ మొత్తం నిశ్శబ్దం అయ్యింది. సభకు హాజరైన ప్రజలు చేతులెత్తి మీ వెంటే ఉంటామంటూ చెప్పడం కనిపించింది.
మెదక్, జహీరాబాద్ లోక్సభకు పోటీచేస్తున్న అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్కుమార్లను ఎలపట..దాపట లెక్క ఉన్నారు..మీ ప్రాంతానికి సేవ చేసే భాగ్యం కల్పించండి అని అన్నపుడు సభలో ఉన్నవారు పిడికిలెత్తి ఉంటామని హామీ ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై నిశితంగా విమర్శలు చేశారు. ‘ డిసెంబర్ 9 తారీఖు ఎటుపాయె.. రుణమాఫీ అయ్యిందా..? రైతు బంధు 15వేలు పడ్డయా.. మన ఆడపిల్లలకు 2500 ఇస్తా అన్నడు.. ఇచ్చిండా..’అంటూ కేసీఆర్ ప్రశ్నిస్తే లేదు.. లేదు అంటూ ప్రజలు సమాధానాలు చెప్పారు. ‘అంబేద్కర్ను అవమానిస్తే ఊరుకుందామా.. దళిత బంధును బందుపెడితే నోరుమూసుకొని ఉందామా’ అని ప్రశ్నించినపుడు ఊరుకునేది లేదు.. కొట్లాడుదామంటూ సభకు వచ్చిన వారు నినాదాలు చేస్తూ చెప్పారు.
సభలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ప్రసంగం ఆలోచింపజేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సందర్భాల్లో ఇచ్చిన హామీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మాదిరిగా ప్రజలకు చూపించారు. రైతు బంధు, రుణమాఫీ తదితర అంశాలపై రేవంత్ ఇచ్చి న హామీలను ఆయన మాటల్లోనే ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి చూపిస్తూ వినిపించారు. ఇక ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాడిన పాట ఉర్రూతలూగించింది. గోవిందా.. గోవిందా అంటూ ఆయన రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గోవిందా అంటూ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆటపాట ఉద్యమ రోజులను గుర్తుకు తెచ్చాయి.
సభకు వచ్చిన కొంత మంది ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. సత్తెమ్మ అనే మహిళా రైతు మాట్లాడుతూ కేసీఆర్ ఉన్నపుడు పంటలకు నీళ్లు ఇచ్చిండని, కరెంటు ఇచ్చిండని, రైతుబంధు ఇచ్చిండని చెప్పారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుబంధు కూడా పడలేదని, కరెంటుతో పెద్ద గోసపడుతున్నామని చెప్పింది. రాయికోడ్కు చెందిన గోపయ్య అనే రైతు మాట్లాడుతూ కేసీఆర్ ముఖ్యమంత్రిగా లేని లోటు ఇప్పుడు కనిపిస్తున్నదని చెప్పారు. బ్యాంకులు రుణాలు ఇవ్వలేదని, రైతుబంధు రాలేదని ఆయన చెప్పారు.