జగిత్యాల, మే 6, (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తన గురువు జైశెట్టి రమణయ్య సార్ను కలిశారు. జగిత్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కేసీఆర్ స్వయంగా తన ఇంటికి రావడంతో రమణయ్య భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం జగిత్యాలలో రోడ్షో నిర్వహించిన కేసీఆర్ ఈ సందర్భంగా తన గురువు, కవి అయిన రమణయ్య సార్ను గుర్తుచేసుకున్నారు. రోడ్షో అనంతరం రాత్రి జగిత్యాలలోని ఎమ్మెల్సీ ఎల్ రమణ నివాసంలో బసచేసిన కేసీఆర్ సోమవారం సాయంత్రం నిజామాబాద్లో రోడ్షోకు వెళ్లడానికి ముందు రమణయ్య ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం అనారోగ్యంతో మంచం నుంచి కదలలేని స్థితిలో ఉన్న రమణయ్యకు పాదాభివందనం చేశారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట కాలేజీలో హిస్టరీ లెక్చరర్గా ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు.
గురుశిష్యులు ఇరువురు కలుసుకున్న సమయంలో కేసీఆర్ తమ గురువైన రమణయ్య సార్ చరిత్ర బోధనలో ఎంతటి అఖండుడో గుర్తుచేసుకున్నారు. 1970 నుంచి 1974 వరకు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో డాక్టర్ రమణయ్య చరిత్ర ఉపన్యాసకుడిగా పీయూసీ, ఇంటర్మీడియెట్, డిగ్రీ తరగతులకు బోధించిన అంశాలను జ్ఞాప కం చేసుకున్నారు. సంక్లిష్టమైన పాఠ్యాంశాన్ని అయినా రమణయ్య సార్ అనర్గళంగా, సులభంగా బోధించేవారని చెప్పారు. చరిత్ర బోధనతో పాటు చరి త్ర పరిశోధన, సౌత్ ఇండియన్ టెంపుల్స్పై ఆయన రాసిన పుస్తకాలు, కరీంనగర్ సమ గ్ర చరిత్ర పుస్తక రచనను కేసీఆర్ ప్రస్తావించారు.
డాక్టర్ రమణయ్య సార్ కూడా కేసీఆర్తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకొ న్నారు. 1972లో సిద్దిపేటకు వచ్చిన కేంద్రమంత్రికి డిగ్రీ కాలేజీలో విద్యార్థిగా ఉన్న కేసీఆర్ నేతృత్వంలో సిద్దిపేటను జిల్లా చేయాలని కోరుతూ వినతిపత్రం అందించిన విషయాన్ని గుర్తుచేసి, కేసీఆర్ను అభినందించారు. 2015లో తెలంగాణ తొలి ఆవిర్భావ వేడుకల సమయంలో తాను ఉత్తమ పరిశోధకుడిగా రాష్ట్రస్థాయి పురస్కారం పొందిన సమయంలో చెప్పానని, ఇప్పుడు మళ్లీ చెబుతున్నానని.. ‘కేసీఆర్ యూ ఆర్ ఏ ఫాదర్ ఆఫ్ తెలంగాణ, క్రియేటర్ ఆఫ్ తెలంగాణ, మేకర్ ఆఫ్ బంగారు తెలంగాణ’ అని కొనియాడారు. కేసీఆర్ వినమ్రపూర్వక నమస్కారం చేశారు.
ఎందరో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి విఫలమయ్యారని, తెలంగాణ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించి, విజయం సాధించి, రాష్ర్టాన్ని సాకారం చేయడం కేసీఆర్కే చెల్లిందని, అలాంటి కేసీఆర్ తనకు శిష్యుడు కావడం ఆనందంగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ను రమణయ్య సార్ శాలువతో సత్కరించడంతో పాటు తాను సంకలనం చేసిన పుస్తకాలను అందజేశారు. రమణయ్య సార్ ఆరోగ్య పరిస్థితులను, చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ రమణయ్యను పరామర్శించిన సమయంలో కేసీఆర్ వెంట జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జగిత్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ తదితరులున్నారు.