నిన్న గాక మొన్న గంగానదిలో బ్రిడ్జి కడుతుంటే కూలిపోయింది. నదులల్లో ఇలాంటివి జరుగుతయి. దానికి ప్రళయం బద్దలైనట్టుగా ఒకటే పని కట్టుకొని, యాత్రలు పెట్టి, మాత్రలు పెట్టి పెద్ద కథ చేసి ఇప్పటికి కూడా పిచ్చి కలల్లోనే ఉన్నరు.
-కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): గోదావరిలో 20 వేల క్యూసెక్కుల వరద దాటినంక కన్నెపల్లి పంపుహౌజ్ ద్వారా నీళ్లు ఎత్తకుంటే తానే 50 వేలమంది రైతులతో వెళ్లి మోటార్లు నడిపిస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హెచ్చరించారు. గోదావరిలో నీళ్ల ప్రవాహం ప్రారంభమయ్యాక మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండానే నీళ్లను ఎత్తిపోయవచ్చని స్పష్టం చేశారు. మిడ్మానేరు, లోయర్మానేరు కళకళలాడుతయని, నీళ్లు ఎత్తకుండా ప్రజల నోట్లో మట్టి కొడుతమంటే చూస్తు కూర్చోబోమని, వీళ్లను పండబెట్టి తొక్కి మోటార్లు నడిపిస్తామని పేర్కొన్నారు. శుక్రవారం సిరిసిల్ల తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. “కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో జరిగిందని, కేసీఆర్ను, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే కుట్రతోనే మేడిగడ్డ దగ్గర నీళ్లను ఎత్తిపోయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా యాక్షన్ప్లాన్ సిద్ధం చేసుకోవాలి.
గోదావరి స్టార్ట్ కాంగనే ఎట్లా ఎత్తిపోయాల్నో, దాని కోసం రెడీకండి. లేకుంటే మే రెడీ అవుతం. ఎట్లా చేయాల్నో అట్ల చేస్తం. రాష్ట్రం రణరంగమైనా మంచిదే. అసలు కాళేశ్వరం గురించి, ఆ ప్రాజెక్టు గురించి వీళ్లకు తోక తెల్వదు.. తొండం తెల్వదు. ఇప్పుడు ఉన్నోడికీ ఏమీ తెల్వదు. కాళేశ్వరానికి మూడు బరాజ్లు ఉన్నయ్. గోదావరి, ఉపనదుల మీద కట్టినవి, వాటితో పాటు అన్ని బరాజ్ల మీద కలిపి 300 పిల్లర్లు ఉంటయి. మూడు బరాజ్లు కలిపి 200 గేట్లు ఉంటయ్. కాంగ్రెస్ పార్టీ నాయకుల అసమర్థత వల్ల దశాబ్దాల పాటు సమైక్యపాలకులు ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టారు. మిడ్మానేరు, ఎల్లంపల్లి బరాజ్ను అసంపూర్తిగా పెట్టారు. వాటిని మేము ఆగమేఘాల మీద పూర్తిచేసినం. ఒక సీజన్లో మేం పనిచేస్తుంటే, మాచారెడ్డి మండలంలో 25 సెంటీమీటర్ల వర్షం కురిసి పెద్ద వరద వచ్చి మిడ్మానేరు కట్ట కొట్టుకొనిపోయింది. అది కట్టినోడు ఏవడండి? ఇవ్వాళ అడ్డంపొడుగు మాట్లాడే మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. వాళ్ల అమ్మ పేరు ఉండే కంపెనీ కట్టింది. మేము చిల్లరగాండ్ల లెక్క చేయలేదు.
ఆగమేఘాల మీద కాళేశ్వరం పూర్తికావాలని, రైతులకు నీళ్లు రావాలని, తాగునీరు, సాగునీటి బాధ పోవాలని ఆరాటపడ్డం. ఆనాడు కోమటిరెడ్డి కంపెనీ మీద కేసు పెట్టలే. మేము కేసు పెట్టకపోదుమా? జైళ్లో వేయకపోదుమా? మీ లెక్క చిల్లర కథ చేయాలంటే చేయకపోదుమా? ఆ రోజు ప్రభుత్వం మా చేతుల్లో లేకుండేనా? దరిద్రుడు పోనీలే అని చెప్పి వదిలేసినం. ప్రాజెక్టు నింపి నిలబెట్టాం. నిండా నింపి గంగమ్మలా తయారు చేశాం. బ్రిడ్జి మీదికెళ్లి పోతుంటే రెండుపక్కల చూస్తే భయమయ్యే పరిస్థితి పెట్టినం. అంత అద్భుతంగా నీళ్లు కనపడేది. సముద్రం లాగా కనపడేది. దాన్ని మీరు ఎడారి చేశారు. నాశనం చేశారు. మీ తెలివి తక్కువ తనం, అసమర్థత వల్ల ఇలా అయింది.
కాళేశ్వరం పని అయిపోయింది అన్నవు కదా. గాయత్రీ పంపు ఎందుకు ఎత్తినవు? ఎట్ల వచ్చినయి నీళ్లు. కాళేశ్వరం లేనిదే వచ్చినయా?
-కేసీఆర్
గోదావరిల నీళ్లు వచ్చేదే, నీళ్లు దోరికేదే ప్రాణహితల. ఇంకోకాడ నీళ్లు లేవు. ప్రాణహిత దాటినంకనే ప్రాజెక్టు కట్టాలి. దాని కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్తో కలిసి ఆరు నెలలు తపస్సు చేసినట్టు చేసి మేడిగడ్డను కనిపెట్టినం. లైడార్ సర్వే కావాలంటే అది కూడా చేశాం. దాని డిజైన్ గురించి వీరికి అవగాహన ఉందా? మేడిగడ్డ బరాజ్లో గోదావరి పొంగే మూడు మూడున్నర నెలలు గేట్లు అన్నీ ఎత్తే ఉంటయి, ఫ్రీ ఫ్లో ఉంటది. మనకు అవసరమైన నీళ్లు ఎత్తుకుంటాం. కన్నెపల్లి దగ్గర పంపుహౌజ్ తెలివితక్కువతో పెట్టలేదు. మేడిగడ్డ బరాజ్ అవసరం లేకుండానే, నీళ్లు ఎత్తుకునే అవకాశం ఉంటది.
నేను ఇంజనీర్లతో మాట్లాడిన. ఈ సన్నాసులకు తెలివి లేకుంటే, మీ తెలివి ఏం సచ్చింది? నీళ్లు ఎందుకు ఎత్తలేదు అన్నా. సార్ మమ్మల్ని నిరోధించారు సార్. అందులో ఏదో ఉన్నది అని చెప్పి, కావాలనే మీద ఉన్న బరాజ్ నీళ్లు వదిలేశారు. వీళ్ల తెలివి తక్కువతనానికి మేం ఏం చేస్తం సార్ అని చెప్పారు.
-కేసీఆర్
ఆ పాయింట్ పట్టుకున్నదే అందుకు. నందిమేడారం, గాయత్రీ పంపుహౌజ్ నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేరు, మిడ్మానేరు ద్వారా ఎల్ఎండీకి, మల్లన్నసాగర్కు, ఎస్సారెస్పీకి.. ఎటు అవసరం ఉంటే అటు వాడుకునేలా మిడ్ మానేరును ఒక ఖజానా చేసినం. గోదావరిలో నీళ్లు ఎత్తడానికి మేడిగడ్డ బరాజ్ అవసరం లేదు. ఎప్పుడు అవసరం పడుతది అంటే 20-25 వేల క్యూసెక్కుల కంటే ఎక్కువ ఉన్నప్పుడు గేట్లు అన్ని ఎత్తుతాం. బరాజ్ల నీళ్లు ఆపరు. మళ్లీ ప్రవాహం 25 వేల క్యూసెక్కులకు తగ్గినప్పుడు నీళ్లు ఆపుతరు. సెప్టెంబర్ మాసం చివర్లో గేట్లు దించుతరు. మొత్తం గేట్లు కూడా దించరు. ఆ చివరి రెండు, ఈ చివరి రెండు వదిలిపెట్టి వచ్చిన నీళ్లు వచ్చినట్లుగా పోయేటట్టు చేసి 9-10 టీఎంసీలు నిలువ ఉండేటట్టు కాపాడుతరు. దాన్ని ఎత్తిపోసుకుంటం. కరెక్టుగా చెరువులు, చెక్ డ్యాంలు, నిండి ఉంటుండే.
భూగర్భ జలాలు రీచార్జి అవుతుండే. పంటలు ఎండకుండా ఉంటుండే. మే నెల తరువాత కూడా చెరువులు మత్తళ్లు దుంకినయ్. కాళేశ్వరం కుంగింది అని కేసీఆర్ను బద్నాం చేయాలె. ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే చిల్లర కుట్రతోని, ప్రేక్షకుల్లాగా, సన్నాసుల్లాగా చూసుకుంట కూర్చుంటే నీళ్లన్నీ పోయినయ్. ఇప్పుడు కూడా 1500 క్యూసెక్కుల నీళ్లుపోతున్నాయి. కన్నెపల్లి దగ్గర 2200 క్యూసెక్కుల సామర్థ్యంతో 17 పంపులు ఉన్నయి. మేము నడిపిన నాడు కూడా మొత్తం పంపులు నడపం. అవసరాన్ని బట్టి చూసుకుంటూ నడుపతం. ఒక్కసారి ఒక పంపు, రెండో పంపు, మూడో పంపులు నడుపతం.
ఇసుక బస్తాలు వేసి కూడా నడపొచ్చు. మొన్న వచ్చిపోయినోడు ఏం చెప్పిండు? రెండు పిల్లర్ల కింద ఇసుక కదిలి, పిల్లర్లు కదిలినయి అని చెప్పిండు. చిల్లర కుట్రలను మనసుల పెట్టుకొని వృథాగా పారే నీళ్లను వదిలిపెట్టిర్రు. ఈ దద్దమ్మలకు చాత కాకపోతే 50 వేల మంది రైతులను వెంబడి వేసుకొని, వీళ్లను పండబెట్టి, తొక్కుకుంట పోయి మేడిగడ్డ కాడ కుర్చీ వేసుకొని ఇవన్నీ నింపుతా. రంది పడకురి అని మొగ్దుంపూర్ కాడ చెప్పిన. దీనిపేరు, దానిపేరు చెప్పి ప్రజల నోట్లో మట్టికొడతమంటే చూస్తూ ఊరుకోబోం. ఎన్నికల తరువాత కాబట్టి మౌనం పట్టినం. గోదావరిలో 20వేల క్యూసెక్కుల వరద దాటినంక నీళ్లు ఎత్తడం ప్రారంభించకపోతే నేనే 50వేల మంది రైతులను వేసుకొని పోతా, వీళ్లను పండబెట్టి తొక్కి మోటార్లను నడిస్తా” అని ప్రభుత్వానికి కేసీఆర్ హెచ్చరికలు జారీచేశారు.