Dasoju Sravan | హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో తాను ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తు చేసుకోవాలనే పేరుతో దగా చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ ఇన్చార్జీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల ఎగవేతకు దారులు వెతుకున్నదని ఆయన ధ్వజమెత్తారు. బుధవారం తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర సచివాలయాన్ని సీఎం రేవంత్రెడ్డి గాంధీభవన్గా భావిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సమక్షంలో రాజకీయ ప్రసంగాలు చేయటాన్ని ఆయన తప్పుబట్టారు. తెలంగాణ అప్పుల పాలైందని సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీ గడ్డపై రాష్ట్రం పరువు తీశారన్నారు. రాష్ట్రపాలన కేంద్రమైన సచివాలయంలో సీఎం హోదాలో ఉన్న రేవంత్రెడ్డి పాటించాల్సిన సంప్రదాయాలను గాలికి ఒదిలేసి, ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా కాకుండా ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజాకేంద్రంగా కేసీఆర్ పాలన సాగిందని ఆయన గుర్తుచేశారు. తొమ్మిద్నిరేండ్ల కేసీఆర్ పాలనలో లబ్దిదారుల ఎంపిక పార్టీతో సంబంధం లేకుండా జరిగిందనే విషయాన్ని గుర్తించాలని ఆయన సీఎంకు సూచించారు. కేసీఆర్ది గడీల పాలన అని ఏడుపే తప్ప ఆరు గ్యారెంటీలపై అమలుకు సీఎం రేవంత్రెడ్డి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నట్టు లేదని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యున్నత పాలనా కేంద్రమైన సచివాలయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్రావులపైనా వ్యక్తిగత విమర్శలు చేయటాన్ని ఆయన తప్పుబట్టారు.
పీసీసీ పదవిని కొనుగోలు చేసి రేవంత్రెడ్డి తెచ్చుకున్నారని స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని ప్రస్తుత మంత్రులే పేర్కొన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ కేటీఆర్ను మేనేజ్మెంట్కోటా అని పేర్కొనటం దుర్మార్గం అన్నారు. కేటీఆర్ది మేనేజ్మెంట్ కోటా అయితే సీఎం రేవంత్రెడ్డిది పేమెంట్ కోటా అని ఆయన ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్ బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను కొనుగోలు చేసి వాటిని విజయవాడలోనే ఉంచారని పేర్కొంటున్న సీఎం రేవంత్రెడ్డి ఆ వాహనాలు ఇష్టంలేకపోతే వాటిని అంబ్యూలెన్స్గా వాడాలని సూచించారు. సర్కార్ దగ్గర లంకెబిందెలు ఉంటాయని భావించాం కానీ, ఖాళీ బిందెలే ఉన్నాయని పేర్కొనాన్ని ఆయన తప్పుపట్టారు. సర్కార్ దగ్గర లంకెబిందెలు ఉండవని, దస్తావేజులు, కాగితాలు ఉంటాయనే విషయం తెలుసుకోవాలన్నారు.
ఎన్నికల సమయంలో కేసీఆర్ సర్కార్ రాష్ర్టాన్ని అప్పుల కుప్ప చేశారని సభల్లో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు చెప్పి అలవిగానీ హామీలు ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. గుప్త నిధుల కోసమో నేలమాళిగ కోసమో సచివాలయాన్ని కూలగొట్టారని నాడు దౌర్భాగ్యంగా ఆరోపించిన నాయకుడు సీఎం రేవంత్రెడ్డి అని మండిపడ్డారు. రాష్ర్టాన్ని అంతా అభివృద్ధి చేసి, ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసి లంకెబిందెలుగా మార్చిన చరిత్ర కేసీఆర్ సర్కార్దన్నారు. అసెంబ్లీలో శ్వేతపత్రాలు పెట్టి అభాసు పాలైందికాక ప్రధాని ముందు కూడా తెలంగాణ పరువు తీశారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని, దానికి అదే వేదికపై తాము పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు కోరితే అనుమతి ఇవ్వలేదని, ఈ నేపథ్యంలోనే తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వేదపత్రాన్ని విడుదల చేశారని చెప్పారు. తెలంగాణ భవన్లో తనను కలిసిన అభాగ్యురాలిని కేటీఆర్ ఆదుకుంటే అందుకు ఏడుపు ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు లబ్దిదారులు ప్రాతిపదిక తెల్లరేషన్ కార్డేనని చెప్తున్న సర్కార్ తిరిగి దరఖాస్తులు చేసుకోవాలని కోరటం వెనుక కుట్ర దాగి ఉందని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల కోడ్ వచ్చేదాకా దరఖాస్తుల పేరుమీద టైంపాస్ చేసి తీరా ఎన్నికల కోడ్ వచ్చిందని బుకాయించి ఆ గ్యారెంటీలను అమలు చేయకుండా ఎగ్గొట్టేందుకే దరఖాస్తుల బాగోతమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రకటించినపుడు షరతులు ఉంటాయని ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. గ్యారెంటీలకు తెల్లరేషన్ కార్డే ప్రాతిపదిక అయితే ఆ కార్డుల వివరాలు సర్కారు దగ్గరున్నాయని, అందుబాటులో ఉన్న సమాచారాన్ని విస్మరించి తిరిగి ప్రజల దగ్గరి నుంచి దరఖాస్తులను ఆహ్వానించటం వెనుక గ్యారెంటీ ఎగవేతకు లేదా కాలయాపనకు కాంగ్రెస్ పార్టీ దారులు వెతుకుతున్నదనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. అవసరం తీరాక ప్రజలను మోసం చేయటం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.
రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు డిసెంబర్ 9వ తేదీన రైతుబంధు కింద రూ. 15వేలు చెల్లిస్తామని బీరాలు పలికిన సీఎం రేవంత్రెడ్డి ఆ ముచ్చటనే విస్మరించారని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఎకరానికి రూ. 15వేలు వేస్తామని చెప్పి ఇప్పుడు దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. దరఖాస్తులు కోరటం దగా కాదా? అని ఆయన ప్రశ్నించారు. అలాగే రూ. 4 వేల పింఛన్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ కాదా? 200 యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నామని, ఇప్పటి నుంచే కరెంట్ బిల్లులు ఎవరూ కట్టకూడదని మాట ఇచ్చింది ఎవరు? దాన్ని ఇప్పటికీ అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్నది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయాన్ని కేసీఆర్ దేశానికే తలమానికంగా నిర్మిస్తే దాన్ని దుబారా అన్న సీఎం రేవంత్రెడ్డి ఇష్టం లేకపోతే దాన్ని బీఆర్ అంబేద్కర్ హాస్పటల్గా మార్చాలని దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. అలాగే ప్రగతిభవన్ను ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్గా మార్చాలన్నారు. సీఎం క్యాంప్ ఆఫీసు ఉండగా (నాటి ప్రగతిభవన్లో) ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి (ఎంసీహెచ్ఆర్డీ) ప్రాంగణంలో ఎకరం స్థలంలో కొత్తగా సీఎం క్యాంపు కార్యాలయం ఎందుకు కడుతున్నట్టు? అది దుబారా కాదా? అని ఆయన ప్రశ్నించారు. పదే పదే వ్యక్తిగత విమర్శలకు దిగే సీఎం రేవంత్రెడ్డికి కోట్లాడి రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని, సీఎం ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న రేవంత్రెడ్డి ఆస్తులను ఏకరువు పెట్టారు.
ప్రభుత్వ పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు తమ పార్టీ షాడోటీమ్స్ను వేస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొనటాన్ని తప్పుపట్టిన సీఎం రేవంత్రెడ్డికి వాటి ప్రాముఖ్యత తెలియదని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష పార్టీలు వాచ్డాగ్గా ఉంటాయని, గతంలో రాజగోపాల్రెడ్డి సహా అనేక మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీ షాడో టీమ్స్గా పనిచేశాయనే కనీస స్పృహ సీఎం రేవంత్రెడ్డికిలేదని ఆయన ఎద్దేవా చేశారు.
రాష్ట్రం అప్పుల పాలైందని, కేసీఆర్ రాష్ర్టానిన దుబారా చేశారని పదే పదే పేర్కొంటున్న సీఎం రేవంత్రెడ్డి దేశంలోని నమస్తే తెలంగాణకు మినహా అన్ని పత్రికలకు యాడ్స్ ఎందుకు ఇచ్చారని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ‘డబ్బులు లేనప్పుడు పేపర్లకు, మీడియాకు దేశమంతా అడ్వటైజ్మెంట్ ఎందుకు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మీడియాలో తనకు అత్యంత చనువు ఉన్నవాళ్లను కేసీఆర్ ఒకమాట అంటే తప్పుబట్టిన సీఎం రేవంత్రెడ్డి మాత్రం జర్నలిస్టులను మాత్రం అరే నాయనా.. అని సంబోధించటం సీఎం హోదాకు తగదన్నారు.