హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ యం త్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అసెంబ్లీ నియోజకవర్గస్థాయి సమావేశాలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజైన శనివారం సిద్దిపేట, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్లగొండ, బోధ్ నియోజకవర్గ సమావేశాలు జరిగాయి. సిద్దిపేట సమావేశానికి స్థానిక ఎమ్మెల్యే హరీశ్రావు, జూబ్లీహిల్స్ సమావేశానికి కేటీఆర్, వనపర్తి సమావేశానికి మాజీమంత్రి నిరంజన్రెడ్డి, నల్లగొండ సమావేశంలో మాజీమంత్రి జగదీశ్రెడ్డి, బోధ్ సమావేశంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చా రు. ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తల సలహాలు సూచనలు తీసుకున్నారు. ఆదివారం మెదక్లో జరగనున్న సమావేశానికి నిరంజన్రెడ్డి, సిరిసిల్లలో కేటీఆర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ముషీరాబాద్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ, పాలకుర్తి సమావేశానికి హరీశ్రావు హాజరవుతారు.