KTR | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 27 (నమస్తే తెలంగాణ): బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమిలో చివరికి మిగిలేది రాహుల్గాంధీ ఒక్కరేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయడం తమవల్ల కాదని మమతాబెనర్జీ, కేజ్రీవాల్, నితీశ్కుమార్ బయటకు వెళ్లిపోయారని గుర్తు చేశారు.
లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా శనివారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్కు కానీ, రాహుల్కు కానీ లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. ప్రాంతీయంగా బలంగా ఉన్న కేసీఆర్, కేజ్రీవాల్, మమతాబెనర్జీ, పినరయి విజయన్ వంటివారు మాత్రమే బీజేపీకి, మోదీకి అడ్డుకట్ట వేయగలరని స్పష్టం చేశారు. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ రెండూ చక్కని అవగాహనతో పనిచేస్తున్నాయని, వాటిది ఫెవికాల్ బంధమని ఆరోపించారు.
అక్కడ డమ్మీ అభ్యర్థులే
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్లో బీజేపీని గెలిపించేందుకు కాంగ్రెస్ అక్కడ డమ్మీ అభ్యర్థులను నిలబెడుతుందని చెప్పారు. అదానీ-మోదీ డబుల్ ఇంజిన్ అన్న సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు అదానీతో కలిసి పనిచేస్తున్నారని, ఆ పార్టీల మధ్య బంధానికి ఇదే నిదర్శనమని వివరించారు. నాలుగు నెలల క్రితం దాసోజు శ్రవణ్, సత్యనారాయణ పేర్లను కేసీఆర్ క్యాబినెట్ తీర్మానించి పంపినా తిరస్కరించిన గవర్నర్ ఇప్పుడు కోదండరాం పేరు పంపగానే సంతకం చేశారని తెలిపారు.
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే బీఆర్ఎస్కు కూడా ఒక స్థానం వచ్చి ఉండేదని, కానీ రేవంత్రెడ్డి ఢిల్లీ వెళ్లి అమిత్షాను కలిసి రాగానే రెండు స్థానాలకు రెండు వేర్వేరు నోటిఫికేషన్లు జారీచేశారని, దీనిని బట్టి చూసినా ఆ రెండు పార్టీల మధ్య ఉన్న బంధాన్ని అర్థం చేసుకోవచ్చని వివరించారు. పార్లమెంటులో తెలంగాణ గొంతు వినబడాలంటే బీఆర్ఎస్ను గెలిపించాలని ప్రజలను కోరారు. సమావేశంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.