ఆదిబట్ల/అమరచింత/ములుగు/బడంగ్పేట, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): ఇటీవల గుండెపోటుతో కన్నుమూసిన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. రెండు కుటుంబాలకు రూ. కోటిన్నర చొప్పున అందజేసి, ఆదుకొన్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడలో ఉన్న సాయిచంద్ ఇంటికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డితో కలిసి మంత్రి సబిత వెళ్లారు. సాయిచంద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, భార్య రజినికి రూ. కోటి చెక్కును అందజేశారు. సబిత మాట్లాడుతూ సాయిచంద్ మరణం బీఆర్ఎస్పార్టీకి తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి కేసీఆర్ అండగా ఉన్నారని భరోసా ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో సాయిచంద్ పాట.. ఆ తర్వాతే కేసీఆర్ మాట ఉండేదని దాసోజు శ్రావణ్ గుర్తుచేశారు. సాయిచంద్ పాట చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎమ్మెల్యే కిషన్రెడ్డి పేర్కొన్నారు.
వనపర్తి జిల్లా అమరచింత మండలకేంద్రంలోని సాయిచంద్ ఇంటికి ప్రభుత్వ విప్ బాల్కసుమన్, మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి వెళ్లిన మంత్రి శ్రీనివాస్గౌడ్, కుటుంబ సభ్యులను పరామర్శించారు. సాయిచంద్ తల్లిదండ్రులు పద్మమ్మ, వెంకట్రాములుకు రూ.50 లక్షల చెక్కును అందజేశారు. అమరచింతలో లైబ్రరీ ఏర్పాటు చేసి సాయిచంద్ పేరు పెడతామని హామీ ఇచ్చారు.
కుసుమ జగదీశ్వర్ కుటుంబ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ బీఆర్ఎస్ పార్టీ తరఫున రూ.1.50 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. జగదీశ్వర్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మానుకోట ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వీ ప్రకాశ్, టీఎస్ రెడ్కో చైర్మన్ సతీశ్రెడ్డి, ములుగు, భద్రాచలం ఎమ్మెల్యే అభ్యర్థులు బడే నాగజ్యోతి, తెల్లం వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
నేను ఒక కళను అని.. ఆ కళ విశ్వవ్యాప్తం అయ్యేందుకు ఒక శక్తిలాగా కేసీఆర్ నిలిచారని సాయచంద్ నాతో తరుచూ చెప్తుండేవారు. సాయి మరణం తర్వాత మా కుటుంబానికి అండగా ఉన్న కేసీఆర్ బాపుకు మా కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.
– వేద రజిని, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్