BRS Party | సిద్దిపేట : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, అక్రమ అరెస్ట్ అని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మండిపడ్డారు. కవిత అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తూ సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు. భారీ బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, పట్టణ అధ్యక్షులు కొండం సంపత్ రెడ్డి , సీనియర్ నాయకులు పాల సాయిరాం, మచ్చ వేణుగోపాల్ రెడ్డి, వంగ నాగిరెడ్డి, ఐదు మండలల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు పాల్గొని మాట్లాడారు. కవిత అరెస్టు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, బీజేపీలో చేరితే అన్ని కేసులు మాయమవుతాయి. బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే లేని కేసులు నమోదవుతాయని మండిపడ్డారు. ఈడీ, సీబీఐ కేసులు నమోదైన కరుడుగట్టిన నేరస్తులెందరినో బీజేపీ ప్రభుత్వం వదిలేసిందన్నారు. మర్డర్ కేసులున్న వారు బీజేపీ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నారన్నారు.
పార్లమెంటు ఎన్నికల ముందు కవితను అరెస్టు చేయడం ద్వారా బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయాలని చూస్తున్నారని, నోటిఫికేషన్ ఇచ్చే ఒకరోజు ముందు అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏమిటని వారు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కవితను అరెస్టు చేయాలని రాష్ట్ర బీజేపీ నాయకులు చేసిన డిమాండ్కు ఈడీ స్పందించడం ఏమిటి అని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐలను బీజేపీ నడుపుతుందా? అవి స్వతంత్ర సంస్థలా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీకి అరెస్టులు, ఉద్యమాలు కొత్త కాదు అని, తమది పోరాడే గుణం ఉన్న పార్టీ. ఇలాంటి బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. న్యాయ పరంగా పోరాటం చేస్తాం. ప్రజల తరుఫున మా పార్టీ పోరాటం కొనసాగుతుంది. నరేంద్రమోదీ, రేవంత్ రెడ్డి కలిసి ఈ కుట్ర చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటై బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారనిన్నారు. ఒకరి కుట్రకు మరొకరు సహకరిస్తున్నారన్నారని మండిపడ్డారు.