BRS | హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాయిదా పడిన మూడు మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు బీఆర్ఎస్ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది.
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీకి ఎమ్మెల్యే లు సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్రెడ్డి, క్యాతనపల్లికి మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఖానాపూర్ మున్సిపాలిటీకి మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్జాదవ్ను ఇన్చార్జులుగా నియమించారు. ఏప్రిల్ 4న ఉదయం 11 గంటల కు సభ్యుల ప్రమాణం స్వీకారం, అదేరోజు మ ధ్యాహ్నం 12:30కు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియ జరపాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇప్పటికే నోటిఫికేషన్ జారీచేసింది.
బీఆర్ఎస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లను సమన్వయ పరిచి మూడు మున్సిపాలిటీల్లో చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ పదవులు కైవసం చేసుకునేందుకు ఇన్చార్జులకు బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 నగర పాలక సంస్థలకు ఫిబ్రవరి 11 ఎన్నికలు నిర్వహించగా, 13న ఫలితాలు వె లువడ్డాయి. 16న మేయర్లు, డిప్యూటీ మేయ ర్లు, చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక జరిగింది. నాడు అధికార కాంగ్రెస్ అరాచకాల కారణంగా బీఆర్ఎస్కు అధిక్యం ఉన్నా.. క్యాతనపల్లి, ఖానాపూర్, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీల చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ల ఎన్నిక వాయిదా పడ్డాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో 24 వార్డులకు మ్యాజిక్ ఫిగర్ అయిన 13 వార్డులను బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఒక స్వతంత్ర, బీజేపీ కౌన్సిలర్ మద్ద తు ప్రకటించడంతో బీఆర్ఎస్ బలం 15కు చేరింది. వాస్తవానికి ఇక్కడ చైర్ పర్సన్ ఎన్నిక కూడా పూర్తయ్యింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది కౌన్సిలర్లు, ఒక బీజేపీ కౌన్సిలర్, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియోతో కలిపి 10 మంది మాత్రమే ఉన్నారు. నాడు ఎన్నికల సమయంలో ఒక సభ్యుడు యాదగిరి సమావేశానికి రాలేదు. అతడి కుటుంబసభ్యులతో కలిసి కాంగ్రెస్ నాయకులు హైడ్రామా నడిపారు. యాదగిరి లేకుండా ఎన్నిక నిర్వహించ వద్దని అతడి కుమారుడితో హైకోర్టులో పిటిషన్ వేయించారు. న్యాయస్థానం ఆదేశాలతో ఎన్నిక తాత్కాలికంగా వాయిదా పడింది.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు బీఆర్ఎస్- సీపీఐ కూటమి కలిసి 14 వార్డుల్లో గెలుపొందాయి. బీఆర్ఎస్ 10, సీపీఐ 4 వార్డులు గెలువగా, కాంగ్రెస్ 7 వార్డుల్లోనే గెలిచింది. చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు జరగకుండా మంత్రి వివేక్ అడ్డకుంటూ వచ్చారు. చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు హాజరు కాకుండా కౌన్సిలర్లను అడ్డకున్నారు. బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లదాడికి దిగారు. ఫిబ్రవరి 17 క్యాతనపల్లిలో జరిగిన గొడవను సాకుగా చూపి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ సహా పలువురు నాయకులను అరెస్టు చేసి జైలుకు పంపారు. గొడవలు, కేసుల కారణంగా ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది.
ఖానాపూర్ మున్సిపాలిటీలో 12 స్థానాల కు బీఆర్ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 3, ఇండిపెండెంట్ ఒక స్థానంలో గెలిచారు. దీంతో చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 7 స్థానాలు ఏ పార్టీకీ రాలేదు. దీంతో ఎన్నిక తొలిరోజు ఫిబ్రవరి 16న కాంగ్రె స్ కౌన్సిలర్లు హాజరయ్యారు. కోరం లేక మరుసటి రోజుకు ఎన్నిక వాయిదా పడింది. రెండో రోజు సైతం కాంగ్రెస్ మినహా బీఆర్ఎస్-బీజేపీ కౌన్సిలర్లు ఎవరూ కౌన్సిల్కు హాజరు కాలేదు. దీంతో రెండో రోజు సైతం ఎన్నిక వాయిదా పడింది. రెండు సార్లూ కోరం లేక ఎన్నిక వాయిదా పడింది.
వాయిదా పడిన క్యాతనపల్లి, ఇబ్రహీంపట్నం, ఖానాపూర్లో వీలైనంత త్వరగా తదుపరి తేదీని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించి ఎన్నికల ప్రక్రియ పూర్తిచేయాలి. కానీ, ప్రభుత్వం ఇక్కడ ఎన్నికలు నిర్వహించకుం డా అనేక ప్రయత్నాలు చేసింది. ఈ అంశం చివరికి హైకోర్టుకు చేరడంతో మూడు వారాల్లోగా ఎన్నికలు పెట్టి ఫలితాలు ప్రకటించాలని ఆదేశించడంతో ఎన్నికల సంఘం కదిలింది. 4న ఎన్నికలు పెట్టాలని నిర్ణయించింది.
ఇబ్రహీంపట్నం
సబితా ఇంద్రారెడ్డి, మాధవరం కృష్ణారావు, దేవిరెడ్డి సుధీర్రెడ్డి
క్యాతనపల్లి
గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్
ఖానాపూర్
జోగు రామన్న, కోవ లక్ష్మి, అనిల్జాదవ్