న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur) అంశంపై చర్చకు పట్టుబట్టి రాజ్యసభ నుంచి సస్పెండ్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎంపీ సంజయ్ సింగ్కు (Sunjay singh) భారత రాష్ట్ర సమితి (BRS) మద్దతు ప్రకటించింది. ఆయనకు మద్దతుగా పార్లమెంటు ఆవరణలో బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, రజిత్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర ధర్నాకు దిగారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎంపీ సంజయ్ సింగ్ను సస్పెండ్ చేయడాన్ని నామ నాగేశ్వరరావు (Nama Nageswara rao) తీవ్రంగా ఖండించారు. సస్పెన్షన్ ను తక్షణమే ఎత్తి వేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇది అప్రజాస్వామికమని ఆగ్రహం వ్యక్తంచేశారు. కాగా, ఆప్ ఎంపీ ఆందోళనకు సంఘీభావంగా సోమవారం సాయంత్రం 6:30 గంటల నుంచి బీఆర్ఎస్ ఎంపీలు ధర్నాలో కూర్చున్న సంగతి తెలిసిందే.
పార్లమెంట్లో ఇవాళ కూడా మళ్లీ మణిపూర్ అంశమే దద్దరిల్లింది. లోక్సభ (Loksabha)లో విపక్షాలు ఇవాళ ఉదయం ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నాయి. మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ గురించి చర్చించాలని డిమాండ్ చేశాయి. కానీ స్పీకర్ ఓం బిర్లా ఆ వాయిదా తీర్మానాలను కొట్టిపారేశారు. ప్రశ్నోత్తరాలను నిర్వహించేందుకు ఆయన సుముఖత వ్యక్తంచేశారు. అయితే ప్రశ్నోత్తరాలను విపక్ష సభ్యుల తమ నినాదాలతో అడ్డుకున్నారు. ఆందోళనలతో సమస్యలు పరిష్కారం కావని స్పీకర్ బిర్లా అన్నారు. సభ హుందాతనాన్ని కాపాడాలని ఆయన సభ్యుల్ని కోరారు.
కానీ విపక్ష సభ్యులు నినాదాలను వెనక్కి తగ్గించలేదు. ప్రశ్నోత్తరాలను అడ్డుకోవడంతో ఆయన సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మణిపూర్ అంశంపై చర్చ చేపట్టాలని ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎంపీ నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. మణిపూర్లో శాంతి నెలకొల్పడంతో పాటు సాధారణ పరిస్థితులు ఏర్పడేలా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. మణిపూర్ ఘటనలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది.