హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : ‘లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీలకు టికెట్ ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్ మాత్రమే. ప్రజలు మమ్మల్ని గెలిపించి పార్లమెంట్కు పంపిస్తే బీసీల సమస్యలపై పోరాడేందుకు అవకాశం దక్కుతుంది.’ అంటున్నారు బీఆర్ఎస్ చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్. ‘నమస్తే తెలంగాణ’కు ఆదివారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, బీసీ బిడ్డగా 45ఏండ్లపాటు పోరాటం చేశానని, 96 కులాలను ఏకం చేసి బీసీల అభ్యన్నతికి బాటలు వేశానని చెప్పారు. నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని, ప్రచారంలో ప్రజా స్పందన చూస్తుంటే చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఇద్దరు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఉన్నత వర్గాల వారు. మీరు బీసీ వర్గానికి చెందిన వారు? ఇది మీకు అనుకులమా? ప్రతికూలమా?
చేవెళ్ల బరిలో నన్ను అభ్యర్థిగా ప్రకటించగానే అందరిలో చర్చ మొదలైంది. ఇద్దరు రెడ్డి అభ్యర్థుల మధ్య బీసీ వ్యక్తి పోరాడుతుండు అని. మా ముగ్గురి పనితనం ఇక్కడి ప్రజలకు బాగా తెలుసు. బీసీలకు అత్యధికంగా టిక్కెట్లు ఇచ్చింది ఒక్క బీఆర్ఎస్సే. కాంగ్రెస్, బీజేపీ బీసీలకు అసలు ప్రాధాన్యతే ఇవ్వలేదు. మా పార్టీ మాత్రమే ఆరుగురు బీసీలను బరిలో దింపింది. బీసీ బిడ్డగా 45ఏండ్లు పోరాడిన వ్యక్తి, 96 కులాలను ఏకం చేసి బీసీల అభ్యన్నతికి బాటలు వేసిన కాసానిని ఓడగొట్టుకుంటమా? అని నన్ను గెలిపించేందుకు బీసీలంతా ఏకమైండ్రు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. అందరి సమన్వయంతో చేవెళ్ల గడ్డపై గులాబీ జెండాను ఎగరేసి కేసీఆర్కు గిఫ్ట్గా ఇవ్వబోతున్నం.
బహుజన నాయకుడిగా మీకు పేరుంది.. ఈ ఎన్నికల్లో ఆ ప్రభావం ఉంటుందా?
శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ దాకా బస్సు యాత్ర చేసి 96 కులాల అధ్యక్షుడిగా బీసీలను ఏకం చేసిన. ఆ కులాల సమస్యలను వెలుగులోకి తెచ్చి పోరాడిన. బీసీల సమస్యలపై పార్లమెంట్లో గళమెత్తాలె అని కేసీఆర్ ఆలోచించి ఆరుగురికి టిక్కెట్లు ఇచ్చారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తా. నియోజకవర్గంలో జాతీయ రహదారుల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల నుంచి అర్బన్ ప్రాంతాలకు మెరుగైన రవాణా, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పార్లమెంట్లో కొట్లాడుతా.
ప్రచారంలో ప్రజా స్పందన ఎలా ఉన్నది?
నాలుగు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. బీఆర్ఎస్ పాలనే మళ్లీ కావాలని కోరుకుంటున్నరు. కాంగ్రెస్ పాలనతో సాగునీరందక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినయ్. కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నరు. కేసీఆర్ ఉన్నంత కాలం రెప్పపాటు కూడా కరెంట్ పోలేదు. గత ఎన్నికల్లో చేసిన పొరపాటును మళ్లీ చేయబోమని కార్మిక, కర్షకులు ముక్తకంఠంతో చెబుతున్నరు. నీటి ఎద్దడి రాకుండా కేసీఆర్ దూరదృష్టితో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరందించిన విషయాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నరు.
ఇంటి పెద్దకొడుకులా కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రంజాన్ తోఫాను కేసీఆర్ ఇచ్చారని, కాంగ్రెస్ పాలనలో అవేమీ లేవని ప్రజలే అంటున్నరు. దళితబందు, బీసీ బంధు, రైతుబంధు రావడం లేదని ఆవేదన చెందుతున్నరు. కాంగ్రెస్ పాలనపై విరక్తిచెంది కేసీఆర్ సభలు, బస్సు యాత్రలు, మా ప్రచారానికి తండోపతండాలుగా తరలివస్తున్నరు. ప్రజా స్పందన చూస్తుంటే కచ్చితంగా బీఆర్ఎస్కు మళ్లీ పట్టం కట్టడం ఖాయంగా కనిపిస్తున్నది.
ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ చెబుతోంది.. దీనిపై మీరేమంటారు?
డిసెంబర్ 9 రాగానే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిండ్రు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం ఆగస్టు 15 అని కొత్త పాట మొదలుపెట్టిండ్రు. కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మలేమని రైతులే చెబుతున్నరు. నాలుగు నెలల పాలనలోనే దెబ్బ మీద దెబ్బ పడిందని రైతులు లబోదిబోమంటున్నరు.
కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు బీఆర్ఎస్ నుంచి వెళ్లినవాళ్లే కదా?
రంజిత్రెడ్డి, కొండా విశ్వేశ్వర్రెడ్డి ఎంతటి అవకాశవాదులో నియోజకవర్గ ప్రజలకు పూర్తి గా తెలుసు. ఐదేండ్ల పాటు కేసీఆర్, కేటీఆర్లతో సన్నిహితంగా ఉండి సొంత ప్రయోజనాలు చూసుకున్నారే తప్ప నియోజకవర్గ ప్రజలకు వారు చేసిందేమీ లేదు. రంజిత్రెడ్డిని పార్టీ అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాతే బయటకు వెళ్లాడు. అధికారం ఉన్నంత కాలం ఎంజాయ్ చేశాడు. లీడర్ అనే వాడు గెలుపులో ఎంత సంతోషంగా ఉండాలో? ఓటమిలోనూ అంతే ఉండాలి. డబ్బు సంచులతో గెలువాలనుకుంటున్న ఆ ఇద్దరికి ప్రజలే గుణపాఠం చెప్తరు.
ప్రతి ఎన్నికల్లో ఓటింగ్కు ఐటీ ఉద్యోగులు దూరముంటున్నారు కదా?
ఈ సారి ఐటీ ఉద్యోగులు పోలింగ్ కేంద్రాలకు తప్పకుండా తరలివస్తారు. కేసీఆర్ పాలనలో ఐటీ రంగం గణనీయంగా వృద్ధి సాధించింది. నాలుగు నెలల్లో ఈ రంగంలో వచ్చిన మార్పును ఐటీ ఉద్యోగులు గమనించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ను గెలిపించుకుంటామని చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాతో నాకు ప్రత్యేక అనుబంధముంది. హైటెక్సిటీ అభివృద్ధికి ఏం చేయాలో నాకు స్పష్టత ఉంది. అంతిమంగా పదేండ్ల పాటు మేం చేసిన పనులు చూడండి. వచ్చే రోజుల్లో ఏం చేస్తామో కూడా చెబుతున్నాం. ఈ ఎన్నికల్లో సబ్బండవర్గాలు బీఆర్ఎస్ పక్షాన నిలబడుతాయన్న విశ్వాసం నాకుంది.