సారంగాపూర్, ఏప్రిల్ 16: కాంగ్రెస్ పార్టీ అబద్ధాలతో అధికారం చేపట్టిందని బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. కాంగ్రెస్ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని, ఆ పార్టీ చెప్పిన అబద్ధాలను ప్రజల ముందు ఎండగట్టాలని కార్యకర్తలకు సూచించారు.
మంగళవారం సాయంత్రం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ మండపంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, ఎన్నికల ఇన్చార్జి లోక బాపురెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఈ ఐదేండ్లలో చేసింది శూన్యమని, ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేదని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ఈ ప్రాంతాన్ని ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. నిధులు తీసుకురాని అసమర్థుడు ధర్మపురి అర్వింద్ అని దుయ్యబట్టారు.
బీజేపీ ప్రజల చెవిలో పూలు పెడితే, కాంగ్రెస్ ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెట్టిందని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఎంపీగా గెలిపిస్తే ఇక్కడ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించి నిధులు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.