హైదరాబాద్, జనవరి 9 (నమస్తే తెలంగాణ): శాసనమండలిని ఇరానీ హోటల్, కాఫీ కేఫ్తో పోల్చడం, సభ్యులను రియల్ఎస్టేట్ బ్రోకర్లని తూ లనాడటం ద్వారా సీఎం రేవంత్రెడ్డి పెద్దల సభను అవమానించారని, దీనిపై ఎథిక్స్ కమిటీలో చర్చించి చర్యలు తీసుకోవాలని పలువురు ఎమ్మెల్సీలు మం డలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డికి ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్రావు, సురభి వాణీదేవి, దేశపతి శ్రీనివాస్ మంగళవారం శాసనమండలి చైర్మన్ చాంబర్లో గుత్తా సుఖేందర్రెడ్డిని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందజేశారు. కళలు, సాహిత్యం, విద్య, వైద్య, సామాజిక, సేవా రంగాలకు చెందిన ప్రముఖులతో భాసిల్లుతూ పెద్దల సభ గా పిలుచుకునే శాసనమండలిని బాధ్యతాయుతమైన సీఎం రేవంత్రెడ్డి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసేవలో పనిచేసిన ప్రభాకర్రావు, ప్రజాకళాకారులు గోరటి వెంకన్న, దేశపతి శ్రీనివాస్ లాంటివారు ఉన్నారని గుర్తుచేశారు.