Kavitha | హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఐటీ జాబ్స్ వస్తే ఎందుకంత అక్కసు, కడుపుమంట అని ప్రతిపక్షాలను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత మీడియాతో మాట్లాడారు.
నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్ ప్రారంభించి మంచి మంచి కంపెనీలను తీసుకొచ్చాం అని కవిత తెలిపారు. ఆ కంపెనీల్లో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించడం జరిగింది. మొత్తం కెపాసిటీ 750 ఉంటే.. ఇప్పటికే దాదాపు 280 మందికి కాల్ లెటర్స్ ఇచ్చి ఉద్యోగాల్లో చేర్పించి, వారి సమక్షంలోనే ఐటీ టవర్ను ప్రారంభించుకున్నాం. అది చూసి ప్రతిపక్షాలు ఉలిక్కిపడ్డాయి.. బీజేపీ కావొచ్చు.. కాంగ్రెస్ కావొచ్చు. కాంగ్రెస్ నుంచి మా వద్ద పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు.. మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ లాంటి నేతలు అక్కసు వెళ్లగక్కారు. ఇంకో పక్క పార్లమెంట్ సభ్యులు అరవింద్ కూడా అలవాటు ప్రకారం అవాకులు చెవాకులు పేలుతూ.. అత్యంత దారుణంగా మాట్లాడారు. 280 ఉద్యోగాలు ఇస్తే ఏమైతది.. ఎందుకోసం ఇచ్చారు. ఇంకా ఎంత అవహేళనగా మాట్లాడరంటే.. నా పార్లమెంట్ ఆఫీసులోనే ఉద్యోగాలు చేసేటోళ్లు 20 మంది ఉన్నారని మాట్లాడారు. మేం జీతగాళ్ల గురించి మాట్లాడటం లేదు.. ఉద్యోగాల గురించి, వ్యాపారాలు చేసే స్తోమత కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇవాళ నిజామాబాద్కు ఐటీ హబ్ రావడంతో స్థానిక యువతలో కొత్త ఉత్సాహం, సంతోషం వచ్చింది అని కవిత గుర్తు చేశారు.
కానీ అరవింద్ అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారని కవిత ధ్వజమెత్తారు. నిజామాబాద్లో 2 లక్షల 77 వేల పెన్షన్లకు రూ. 4 వేల కోట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 2 లక్షల 59 వేల మంది రైతులకు రూ. 2,616 కోట్లు రైతుబంధు రూపంలో ఇచ్చాం. 4700 మంది రైతులు చనిపోతే రూ. 239 కోట్లు రైతుబీమా ఇచ్చాం. రూ. 2,800 కోట్లు రుణమాఫీ చేశాం. 77 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించగలిగింది. దీనికి రూ. 13 వేల కోట్లు చెల్లించింది ప్రభుత్వం. వీటన్నింటిలో బీజేపీ కంట్రిబ్యూషన్ ఏముంది..? సున్నా కంట్రిబ్యూషన్ బీజేపీది. నిజామాబాద్కు ఇది కావాలని పార్లమెంట్లో ఒక్కనాడు కూడా ఎంపీ మాట్లాడలేదు.. కానీ పాలిటిక్స్ మాత్రం మాట్లాడుతారు. ఒక్కసారి కూడా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడలేదు. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు ఐటీ జాబ్స్ వస్తే ఎందుకంత అక్కసు.. కడుపుమంట. పిల్లలు ఎప్పుడు మీ వెనుకాల జెండాలు పట్టుకొని తిరగలా..? అని కవిత నిలదీశారు.