హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు ముఖ్యమంత్రి కేసీఆర్ తొత్తులు కాదు.. ఆత్మబంధువులు అని ఆమె ఉద్ఘాటించారు.
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ డైరీ, క్యాలెండర్ను నాంపల్లిలోని టీఎన్జీవో హైదరాబాద్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. టీఎన్జీవోతో , తెలంగాణ ఉద్యోగులతో భారత రాష్ట్ర సమితికి, కేసీఆర్కు ఒక తల్లికి, బిడ్డకు ఉన్న పేగు బంధం ఉందని పేర్కొన్నారు. భారతదేశం ప్రపంచంలో విజయవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థగా ఉండటానికి ఉద్యోగులే ప్రధాన కారణమని ఆమె తెలిపారు.
ఎన్నికల నిర్వహణలో ఉద్యోగ ఉపాధ్యాయులు పడే శ్రమ ఫలితంగానే భారతదేశ గౌరవం ప్రపంచ వ్యాప్తంగా వెలుగొందుతుందని, ప్రజలకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగులు చేసిన త్యాగాలు మరువలేనివని ఎమ్మెల్సీ కవిత గుర్తుచేశారు. ఉద్యోగులపై పూర్తి నమ్మకముందని సీఎం కేసీఆర్ అనేక సార్లు చెప్పారని, ప్రభుత్వ ఆలోచన విధానాలను ప్రజలకు చేరవేసి అమలు చేస్తారని తెలిపారు. భారతదేశంలో ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ప్రకటించుకున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని కవిత స్పష్టం చేశారు.
కేసీఆర్ కిట్, భూ సంస్కరణలు లాంటి అనేక కార్యక్రమాలు సూపర్ హిట్ అయ్యాయంటే దానికి కారణం ఉద్యోగులే అని కవిత తెలిపారు. భారతదేశంలో ఏ అవార్డులు వచ్చినా, తెలంగాణకే మొదటి మూడు అవార్డులు వస్తున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, దీనికి కేసీఆర్ ఆలోచనతో పాటు, ఉద్యోగుల కష్టం కూడా ఉందన్నారు. వ్యవసాయ శాఖలో 15 వేల మంది కొత్త ఉద్యోగులు, ఇంజనీరింగ్ విభాగంలొ 10వేల మంది కొత్త ఉద్యొగులు, ఇంకా ఇతర శాఖల్లో కొత్త ఉద్యోగాలను నియమించి అన్ని శాఖలను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. శాశ్వత ఉద్యోగులకు 73 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడంతో పాటు, దేశంలో ఎక్కడా లేని విధంగా శాశ్వత ఉద్యోగుల ఫిట్మెంట్ను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం అమలు చేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఎమ్మీల్సీ కవిత పేర్కొన్నారు.
ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు అన్న బండి సంజయ్ విమర్శలకు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత, ఉద్యోగులు కేసీఆర్ తొత్తులు కాదని, ఆత్మబంధువులని స్పష్టం చేశారు. ఉద్యోగులు, ప్రభుత్వం వేరు కాదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో 13 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, బీజేపీ ప్రభుత్వం నియామకాలు చేపట్టలేదని, కానీ తెలంగాణలో లక్షా 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని తెలిపారు. ఉద్యోగాల భర్తీని సైతం బండి సంజయ్ తప్పు పడుతూ, యువకులను నిర్వీర్యం చేయాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశం మొత్తం తెలంగాణ మోడల్ మీద చర్చ జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సింగరేణి, బీహెచ్ఈఎల్ లాంటి సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ప్రభుత్వ సంస్థలను అమ్ముతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అయాచితం శ్రీధర్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్, టీఎస్ ఈడబ్ల్యుఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబుద్దీన్, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, టీఎన్జీవో హైదరాబాద్ అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ, టీఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.