Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి చిల్లర మాటలకు చిరునామామా మారారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలపై నరనరాన విషం నింపుకుని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
మోదీని నొప్పించకుండా.. చంద్రబాబును మెప్పించాలి అనే ధోరణితో రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో మిడతలా ఎగిసిపడుతున్నాడు. తెలంగాణకు శాపంగా మారాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల గురించి రేవంత్ రెడ్డికి పట్టదా..? చంద్రబాబుకు రేవంత్ రుణపడి ఉండాలి తప్పు లేదు. కొడంగల్లోనో, నీ ఫార్మ్ హౌజ్లో చంద్రబాబు గుడి కట్టుకో తప్పులేదు. చంద్రబాబు గురించి గోదావరి ,కృష్ణా జలాలను ఫణంగా పెడితే మాత్రం రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెడుదాం జాగ్రత్త అని దాసోజు శ్రవణ్ హెచ్చరించారు.
బుద్ది జ్ఞానం లేకే రేవంత్ రెడ్డి కేసీఆర్కు నీళ్ల పట్ల చిత్తశుద్ధి లేదంటున్నాడు. కేసీఆర్కు నీళ్లపై శ్రద్ధ లేకుంటే తెలంగాణ ఇంత సస్య శ్యామలం అయ్యేదా..? కేసీఆర్ హయంలో తెలంగాణలోని 86 శాతం సాగు యోగ్యమైన భూమిగా మారింది. రేవంత్ హయంలో 2 శాతం తగ్గింది. కేసీఆర్ గోదావరి జలాలను వాడుకుని తెలంగాణను సస్యశ్యామలం చేశాక రాయలసీమకు నీళ్లివ్వాలి అన్నాడు. ఇందులో తప్పు ఏం ఉంది..? అపెక్స్ కౌన్సిల్లో కేసీఆర్ చేసిన వాదనలు రేవంత్ రెడ్డి తప్పుగా ప్రచారం చేస్తున్నారు. ఎజెండా నెంబర్ 5ను ఉద్దేశపూర్వకంగా రేవంత్ విస్మరించి ఎజెండా 1 గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ అనుమతి లేకుండా ఏపీలో గోదావరి ప్రాజెక్టులకి అంగీకరించమని కేసీఆర్ స్పష్టం చేశారు. 2020 అక్టోబర్ 2న అప్పటి జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ కు రాసిన లేఖలో సముద్రం లో కలుస్తున్న 3 వేల టీఎంసీ ల్లో 1950 టీఎంసీలు తెలంగాణ కు కేటాయించాలని కేసీఆర్ కోరారు. గోదావరి లో హక్కుగా ఉన్న 968 టీఎంసీలకు తోడు 1950 టీఎంసీలు కావాలని అంటే దాదాపు 3 వేల టీఎంసీలు కావాలని కోరారు. వెయ్యి టీఎంసీలు చాలు అంటున్న రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి కాదా..? నీ తాత జాగీరా రేవంత్ రెడ్డి వెయ్యి టీఎంసీలు చాలు అనడానికి. చంద్రబాబును అడుక్కుంటావా..? అని దాసోజు శ్రవణ్ నిలదీశారు.
2023లో హరీష్ రావు కేంద్రానికి రాసిన లేఖను కళ్లు పెద్దవి చేసుకుని చూడు రేవంత్ రెడ్డి వాస్తవాలు తెలుస్తాయి. 2017 జూన్ 26న కృష్ణా జలాల్లో వాటా కోసం మరో లేఖ కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం రాసింది. 299 టీఎంసీలు తాత్కాలిక అవగాహన మాత్రమే.. ఫైనల్ అగ్రిమెంట్ కాదు. ఇది రేవంత్కు కూడా తెలుసు. సెక్షన్ 3 ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్లో వాదన జరగాలని 32 సార్లు లేఖలు రాసి కేసీఆర్ చివరకు విజయం సాధించారు అని శ్రవణ్ గుర్తు చేశారు.
బాడీ షేమింగ్ గురించి సీఎం హోదాలో ఉండి మాట్లాడొచ్చా..? వేరే దేశంలో అయితే కేసు పెట్టేవారు. హరీష్ రావు పొడుగ్గా ఉంటే నీకు వచ్చిన నష్టం ఏమిటి..? నువ్వు పొట్టిగా ఉండి సీఎం కాలేదా..? దమ్ముంటే రేవంత్ రెడ్డి హరీష్ రావుతో చర్చకు రావాలి. హరీష్ రావు ఒక్కరే చర్చకు వస్తారు. మేము ఒప్పిస్తాం. రేవంత్ రెడ్డి ఎంతమందినైనా చర్చకు తీసుకురా..? ఎవరికెంత జ్ఞానం ఉందో తేల్చేద్దాం. ఏ విషయం తెలియని రేవంత్ రెడ్డి ఇకనైనా తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. 18 నెలల్లో రేవంత్ రెడ్డి ఏదైనా మంచి పని చేశారని నిరూపిస్తే నేను గుండు కొట్టించుకుంటా. అందాల పోటీలతో రాష్ట్రాన్ని అభాసు పాలు చేశాడు అని దాసోజు శ్రవణ్ ధ్వజమెత్తారు.