BRS MLAs | హైదరాబాద్ : శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సభ జరుగుతున్నప్పుడు మీడియా పాయింట్ వద్దకు అనుమతి లేదని పోలీసులు చెప్పగా, ఉత్తర్వులు చూపాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వడం లేదని, మీడియా పాయింట్ వద్ద కూడా అవకాశం లేదా..? అని ప్రశ్నించారు. బారికేడ్లు అడ్డుగా పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మె్యేలు అక్కడే బైఠాయించారు. ఈ నిరసనలో హరీశ్రావు, కేటీఆర్, జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, కడియం శ్రీహరి, సబితా ఇంద్రారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.