హైదరాబాద్: మండలి సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (BRS MLCs) డిమాండ్ చేశారు. కౌన్సిల్ పోడియం వద్ద నిరసనకు దిగారు. నల్ల కండువాలతో నిరసన తెలిపారు. దీంతో కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభను పది నిమిషాలపాటు వాయిదావేశారు. ఈ సందర్భంగా సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీకి పంపినట్లు మండలి చైర్మన్ తెలిపారు. కాగా, మండలి సభ్యులను ముఖ్యమంత్రి అవమాన పరిచారని ఎమ్మెల్సీ భాను ప్రసాద్ అన్నారు. వెంటనే క్షమాపనలు చెప్పాలన్నారు. సభా గౌరవ మర్యాదలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మోతె శోభన్ రెడ్డి సభలోకి నల్ల కండువాలను తీసుకొస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నల్ల కండువాల వేసుకొని రావడానికి వేల్లేదని నిలువరించారు. దీంతో ఎమ్మెల్సీలకు, మార్షల్స్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. నిరసన తెలపడం తమ హక్కని, కావాలంటే సస్పెండ్ చేసుకోవాలంటూ ఎమ్మెల్సీలు భాను ప్రసాద్, శోభన్ రెడ్డి, తాతా మధు, మహమూద్ అలీ సభలోకి వెళ్లిపోయారు.