Srinivas Goud | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుంది ముసళ్ల పండగే అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేసీఆర్ ఇచ్చిన వాటి కంటే ఎక్కువ ఇస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేశారని, ఆ హామీలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తే సంతోషం.. చేయకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. సీఎం పాలమూరు జిల్లా అభివృద్ధిపై మాట్లాడితే బాగుంటుందని, అభివృద్ధి జరగలేదని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించిన రేవంత్ రెడ్డి.. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించాలని అన్నారు. సీఎంతో పాటు తాము కూడా వచ్చేందుకు సిద్ధమని తెలిపారు.
గురువారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందని సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో చేసినా.. ప్రజలు ఇంకా ఎక్కువగా కోరుకున్నారని అన్నారు. అందుకే కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలో వలసలు ఆగాయని స్పష్టం చేశారు. ఉమ్మడి ఏపీలో పాలమూరు బాగుందా, రాష్ట్ర ఆవిర్భావం తరువాత అభివృద్ధి జరిగిందా చెప్పాలని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నపుడు అభివృద్ధి జరిగిందా? కేసీఆర్ హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ హయాంలో శిలాఫలకాలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అంటూ శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ వచ్చినందుకే రేవంత్ సీఎం అయ్యారని, జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయినందుకు జిల్లా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. కేసీఆర్ ఒక్క ఓటమిపై ఇన్ని అభాండాలా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు జాతీయ పార్టీలకే పొత్తు అవసరమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్కు ఏ పార్టీతోనూ పొత్తు అవసరం లేదని స్పష్టం చేశారు. బీజేపీ వాళ్లకు అలాంటి ఆలోచన ఏమైనా ఉండొచ్చని అభిప్రాయడపడ్డారు. తమ పార్టీ అభిప్రాయాన్ని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ నిర్ణయిస్తారని తెలిపారు.