MLA Prashanth Reddy | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి కేటీఆర్పై కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.
ఎలాంటి అవినీతి జరగని ఫార్ములా ఈ కార్ రేస్లో విచారణకు ఏసీబీ అనుమతి ఇస్తూ గవర్నర్ అనుమతి తెలపడంతో కాంగ్రెస్, బీజేపీలు కలిసి కేటీఆర్పై కుట్రలు చేస్తున్నాయనేది తేటతెల్లామైంది. ఇచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చినపుడు, ఎన్నికలు వచ్చినపుడు ఇలాంటి కేసుల అంశాన్ని తెరపైకి తెచ్చి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు అని ప్రశాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.
రెండేండ్లుగా ఫార్ములా ఈ రేస్పై విచారణ పేరుతొ కొండను తవ్వి ఎలుకను పట్టలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు కక్షపూరిత రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపింది. అందులో భాగంగానే విచారణ పేరిట కేటీఆర్ను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఫార్ములా ఈ కార్ రేస్తో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ వ్యాప్తం చేసిండు కేటీఆర్. అక్రమ కేసులతో కేటీఆర్, బిఆర్ఎస్ నాయకులను కట్టడి చేయగలం అనుకోవడం పొరపాటే. మీరెన్ని అక్రమ కేసులు పెట్టిన ప్రజలకు ఇచ్చిన హమీలు అమలు అయ్యేవరకు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడుతూనే ఉంటాం. కేటీఆర్కు బీఆర్ఎస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. న్యాయస్థానాలపై మాకు పూర్తి నమ్మకం ఉంది.. మీరు చేసే కుట్రలను న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం అని ఆయన పేర్కొన్నారు.