హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరాన్ని విఫల ప్రాజెక్టుగా ముద్ర వేసే ప్రయత్నం చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. మేడిగడ్డను రిపేర్ చేసేందుకు అవకాశం ఉందని, ఇందుకోసం నిపుణుల కమిటీని వెంటనే నియమించాలని కోరారు. శనివారం ఆయన శాసనసభలో మాట్లాడారు.
ఎన్డీఎస్ఏ బృందం వచ్చి రెండు గంటల పాటు ప్రాజెక్టును పరిశీలించి రాజకీయ ప్రేరేపిత స్టేట్మెంట్ ఇచ్చారే తప్ప.. ఏమైనా జియో ఫిజికల్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. మిగతా రెండు ప్రాజెక్టుల్లో కూడా ఏదో జరిగిందంటూ విఫల ప్రాజెక్టు కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై నిపుణులు ఎవరైనా నిర్ధారణ చేశారా? అని ప్రశ్నించారు. అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి అన్ని నివేదికలు మీకు అనుకూలంగానే వస్తాయని అన్నారు.
కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు అనడానికి పండిన పంటలు, పెరిగిన సాగు విస్తీర్ణమే ఉదాహరణ అని స్పష్టం చేశారు. ఎస్సారెస్పీ రెండో దశలో 2018 తర్వాతే నీళ్లు వస్తున్నది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. లోయర్ మానేరు కింద ఉన్న హుజూర్నగర్కూ నీళ్లు వస్తున్నాయన్నారు. కోదాడ, హుజూర్నగర్లో 16 లక్షల ఎకరాల స్థిరీకరణ ఎలా జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు.
కేసీఆర్ ఒక్కరే అన్నీ చేయలేదు
కాళేశ్వరం నిర్మాణం కేసీఆర్ ఒక్కరి ఆలోచనే కాదని, ఆయన ఆలోచన చేసి, అనేక మంది అభిప్రాయాలు తీసుకున్నారని పల్లా అన్నారు. ఆయా ఏజెన్సీలు అన్ని అంశాలను పరిశీలిస్తాయని తెలిపారు. సీడబ్ల్యూసీ 50 ఏండ్ల లెక్కల్లో కాళేశ్వరం కిందనున్న మేడిగడ్డలో నీటి లభ్యత ఉంటుందని తేలిందని చెప్పారు. అందుకే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేసీఆర్ నిర్ణయించినట్టు తెలిపారు. ఎల్అండ్టీ చీఫ్ సుబ్రహ్మణ్యం వచ్చినప్పుడు ఆయనతో కేసీఆర్ ఒకే మాట చెప్పారని.. ‘మీకున్న పదుల ప్రాజెక్టుల్లో ఇదొకటి కావొచ్చు.. కానీ ఇది తెలంగాణ ప్రజలకు లైఫ్ లైన్, అత్యంత నాణ్యతతో నిర్మాణం ఉండాలి’ అని సూచించిన విషయాన్ని పల్లా గుర్తు చేశారు.
కాల్వలు తవ్వి నీళ్లు ఇవ్వండి: సబితా ఇంద్రారెడ్డి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి రిజర్వాయర్ల నిర్మాణం పూర్తయిందని, ఇప్పుడు తొందరగా కాల్వలు తవ్వి సాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. శనివారం ఆమె అసెంబ్లీలో మాట్లాడారు. తనను సీఎం రేవంత్రెడ్డి మరోసారి చేవెళ్ల చెల్లెమ్మ అని గుర్తు చేసినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. తన విజ్ఞప్తి మేరకు అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డి ప్రాజెక్టుల్లో తొలి పునాది చేవెళ్లలోనే వేశారని గుర్తు చేశారు.