ఎదులాపురం, ఆగస్టు 9 : సీసీఐ సిమెంట్ పరిశ్రమను పునఃప్రారంభించాలనే డిమాండ్తో సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ విశ్రాంతి భవనం ఎదుట రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈనెల 9 నుంచి సెప్టెంబర్ 10 వరకు చేపట్టనున్న ఈ దీక్షల్లో తొలిరోజు భూనిర్వాసితులు కూర్చున్నారు. దీక్షను జోగు రామన్న ప్రారంభించి కూర్చున్న వారికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరించే వరకు సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామన్నారు.
2014-15లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించేందుకు అనేక ప్రయత్నాలు చేశారని తెలిపారు. జిల్లాలో మూతపడిన సీసీఐ, సిర్పూర్ పేపర్ మిల్లులను తెరిపించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని పేరొన్నారు. ఎస్పీఎం ప్రైవేట్ యాజమాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమలకు కల్పించే రాయితీలు ఇవ్వడంతో ఆ పరిశ్రమ పునఃప్రారంభమైందన్నారు.
అయితే సీసీఐ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యేల వరకు ప్రతి ఒకరూ సీసీఐని తెరిపిస్తామని హామీలు ఇచ్చారని, ప్రస్తుతం ఫ్యాక్టరీని తుకు కింద విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సీసీఐ ఫ్యాక్టరీని పునఃప్రారంభించే వరకు ఆందోళనలు, రిలే దీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేష్, కో-కన్వీనర్ నారాయణ, నాయకులు సాజిదొద్దీన్, బండి దత్తాత్రి, అన్నమొల్ల కిరణ్, అజయ్, దాసరి రమేష్ పాల్గొన్నారు.