Padi Kaushik Reddy | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచానని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. పొన్నం ప్రభాకర్లా నక్క జిత్తులతో గెలవలేదని అన్నారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్పై మండిపడ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన తనను గెలిపించేందుకు తన భార్యాబిడ్డలు ప్రచారం చేశారని.. తన గెలుపు కోసం వాళ్లు ప్రచారం చేయడంలో తప్పేముందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ను నిలదీశారు. నా గెలుపునకు నా భార్యాబిడ్డలు కారణమైతే.. నీ ఓటమికి నీ భార్య కారణమా? అని ప్రశ్నించారు. 2018లో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేసినప్పుడు పొన్నం ప్రభాకర్ ఓడిపోవాలని ఆయన సతీమణి ఆత్మహత్యయత్నం చేసింది అబద్ధమా? అని ప్రశ్నించారు. ఒకరిని అనే ముందు తనేంటో తాను తెలుసుకోవాలని హితవు పలికారు.
హుజూరాబాద్లో ఓటమి ఎరగని ఈటల రాజేందర్ను ఓడించి తెలంగాణ ప్రజలతోపాటు దేశ ప్రజలు హుజూరాబాద్ వైపు చూసేలా చేశానని పాడి కౌశిక్రెడ్డి తెలిపారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రవీణ్రెడ్డి తన గెలుపు కోసం అన్ని విధాలా ప్రయత్నాలు చేసుకున్న తరువాత ఆయనకు కేటాయించే సీటును పొంది పొన్నం నక్కలా వెళ్లి గెలిచాడని ఎద్దేవా చేశారు. దమ్ము, ధైర్యమున్న నాయకుడివైతే కరీంనగర్లో పోటీ ఎందుకు చేయలేదో చెప్పాలని నిలదీశారు. సొంత నియోజకవర్గంలో గెలవలేడనే భయంతోనే పక్క నియోజకవర్గానికి వెళ్లాడని ఎద్దేవా చేశారు.