KTR | హైదరాబాద్ : తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ తొలిసారి శాసనసభకు వచ్చారు. మంత్రి అయ్యారు.. అప్పుడే ఉలికిపాటు ఎందుకు..? ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ దురాగతాలను బరాబర్ చెప్తామని పొన్నంను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
ఈ చర్చ సందర్భంగా అలిశెట్టి ప్రభాకర్ కవితను కేటీఆర్ గుర్తు చేశారు. ఒక నక్క ప్రమాణస్వీకారం చేసిందట.. ఇంకెవర్నీ మోసగించనని, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట.. తోటి జంతువులను సంహరించనని అలా ఉంది గవర్నర్ ప్రసంగం, కాంగ్రెస్ ప్రభుత్వ తీరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
గవర్నర్ ప్రసంగంలో అసత్యాలు తప్ప వాస్తవాలు ఒక్కటి కూడా లేదు. గత ప్రభుత్వం అని చాలా సార్లు ప్రస్తావన చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేం ప్రజా పక్షమే. తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే.. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నకటికైనా విపక్షమే. ప్రజల తరపున గొంతు విప్పుతాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఎట్ల ఉండేనో తప్పకుండా అద్దం చూపెట్టాల్సిన బాధ్యత మా మీద ఉంది. గతంలో ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వంలో పడావు పడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలే కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ కల్పించుకోగా, కేటీఆర్ ఘాటుగా సమాధానం ఇచ్చారు.
పొన్నం ప్రభాకర్ మొదటి సారి శాసనసభకు వచ్చారు. మంత్రి అయ్యారు. తొందరపడకండి. మా తాతలు నేతులు తాగిండ్రు. మా మూతుల వాసనలు చూడుండ్రి అంటే కుదరదు. కేవలం క్రెడిట్ మాత్రమే మేం తీసుకుంటాం. నాగార్జున సాగర్ కట్టినం, శ్రీశైలం కట్టినం. మిగతాది అంతా వేరే ఖాతాలో తోస్తామంటే కుదరదు. బరాబర్ చెప్తాం ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల తరపున
కాంగ్రెస్ పార్టీ దురాగతాలను బరాబర్ చెప్తాం. పడావు పడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, కర్ఫ్యూలు, ఎన్కౌంటర్లు, కరెంట్ కోతలు, కటికె చీకట్లు, నెర్రెలు బారిన నేలలు, నెత్తురు కారిన నేలలు ఇదే కదా.. మీరు ఘనత వహించిన ప్రభుత్వంలో అద్భుతాలు ఇవే కదా..? అని పొన్నంను కేటీఆర్ నిలదీశారు.