Kadiyam Srihari | జనగామ : కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు పరచలేక బీఆర్ఎస్ పార్టీ పై ఎదురుదాడి చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. బుధవారం కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను గమనిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి మహిళలను, రైతులను, యువకులను మోసం చేసింది. బీజేపీ నాయకులు చవటలు, దద్దమ్మల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్లు దక్కని బీజేపీ పార్టీతో మాకు పొత్తు ఏంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. చిన్న చిన్న పార్టీలను కలుపుకొని పొత్తు పెట్టుకునే దౌర్భాగ్యస్థితి బీజేపీదన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారు. మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి రాజకీయ పబ్బం గడుపుకునే పార్టీ బీజేపీ అని అన్నారు. సెక్యులర్ పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ.. బీజేపీతో ఎలాంటి పొత్తు పెట్టుకోదన్నారు. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ హక్కుల కోసం, గోదావరి జలాల కోసం పోరాటం చేసే పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ప్రజాసంక్షేమం, అభివృద్ధిపై ధ్యాస లేదన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ మధ్యే పోటీ ఉంటుందన్నారు. బీజేపీ వారిని హెచ్చరిస్తున్నాం.. మాటలు జాగ్రత్తగా మాట్లాడకపోతే ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెబుతారన్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి.