Harish Rao | మెదక్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మ్యానిఫెస్టోలో 412 హామీలున్నాయని, వాటిలో ఎన్ని అమలు చేస్తారో.. ఎంత వరకు అమలవుతాయో చూద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆ హామీల కోసం ప్రజాక్షేత్రంలోనే పోరాడుదామని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మెదక్లో బుధవారం మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ఆధ్వర్యంలో మెదక్, హవేళీఘణపూర్ మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధమని, కేసీఆర్ అంటే నమ్మకం, బీఆర్ఎస్ అంటే విశ్వాసమని అన్నారు. ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పనిచేశారని, మెదక్ పార్లమెంట్ పరిధిలో ఆరు స్థానాలు గెలిచామని చెప్పారు. ‘మీరంతా నా కుటుంబ సభ్యులే, మీకు ఏ ఆపద వచ్చినా నేనుంటా’ అని భరోసానిచ్చారు. బీఆర్ఎస్ హయాంలో 50వేల కోట్లు విద్యుత్తు శాఖకు ఖర్చు చేసి రైతులకు ఉచిత కరెంటు ఇచ్చామని పేర్కొన్నారు. హైదరాబాద్కు గోదావరి నీళ్లు తెచ్చి మెదక్ జిల్లాకు సింగూరు జలాలు ఇచ్చామని తెలిపారు. ఎప్పుడైనా కాంగ్రెసోళ్లు చెక్డ్యాంలు కట్టినారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల పట్ల బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్తో ఉన్నదని అన్నారు.
రైతుబంధు కింద 13 సార్లు 72వేల కోట్లిచ్చాం
కరోనా వచ్చినా రైతులకు రైతుబంధు వేశామని, బీఆర్ఎస్ పాలనలో ఏ ప్రభుత్వ పథకం ఆగలేదని హరీశ్రావు గుర్తు చేశారు. రైతుబంధు కింద 13 సార్లు రూ.72వేల కోట్లు ఇచ్చామని స్పష్టంచేశారు. రైతుబీమాతో రైతుల కుటుంబాలకు అండగా నిలబడింది బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. రైతుబీమా దండగ అని అసెంబ్లీలో కాంగ్రెసోళ్లు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలు ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా అమలు చేశామని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదాం…
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని హరీశ్రావు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఫేక్ వార్తలతో బీఆర్ఎస్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఏ కష్టం వచ్చినా అధైర్యపడొద్దని సూచించారు. మెదక్ ఎంపీ గెలవడం పక్కా అని, భవిష్యత్తు మనదేనని ధీమా వ్యక్తం చేశారు. మెదక్లో ఓటమి స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని అన్నారు. పాపన్నపేట మండలం ఏడుపాయల అభివృద్ధికి కేసీఆర్ రూ.100 కోట్లతో జీవో ఇచ్చారని, ఈ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందో లేదో చూద్దామని అన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.