Harish Rao | కొడంగల్ : కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపోళ్లకు చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, క్యాలెండర్లు, బ్యాగులు చీరలు పంచుతున్నారు. ఇదేనా బీజేపీ చేసే పని..? అని హరీశ్రావు నిప్పులు చెరిగారు. కొడంగల్లో ఏర్పాటు చేసిన మహబూబ్నగర్ పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్రావు పాల్గొని ప్రసంగించారు.
గెలిచినా.. ఓడినా ప్రజల మధ్య ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఓడిపోతే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు పోరాడుతున్నాం. ప్రజల మధ్యలోనే ఉంటాం. ప్రజల కోసం పని చేసే పార్టీ బీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో ఆలోచించాలి. కాంగ్రెస్, బీజేపీ ఓట్లు వేయమని అడుగుతున్నారు. పదేండ్ల బీజేపీ, పదేండ్ల బీఆర్ఎస్ పాలన చూశారు. బీఆర్ఎస్ ఏం చేసింది అని అడిగితే 100 స్కీమ్లు చెప్తారు. రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ కిట్, ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మి.. ఇలా వంద పథకాల పేర్లు మీరు చెప్పగలుగుతారు అని హరీశ్రావు తెలిపారు.
మరి బీజేపీ ఏం చేసిందో చెప్పగలుగుతారా..? ప్రచారానికి గ్రామాల్లోకి వచ్చే బీజేపీ నాయకులకు నిలదీయండి. దళితులకు, గిరిజనులకు, రైతులకు, పేదలకు మంచి పని చేయలేదు. కొన్ని పనులైతే చేసింది.. పెట్రోల్ డిజీల్ ధర పెంచింది. అదే విధంగా గ్యాస్ సిలిండర్ ధర రూ. 1000 పెంచారు. ఎన్నికలు వచ్చాయంటే వంద దించారు. మనం ఏమన్న అమాయకులమా..? చెవుల్లో ఏమన్న పువ్వులు పెట్టుకున్నామా..? నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెరిగిన ధరలతో పేదల నడ్డి విరిచింది ఈ బీజేపీ ప్రభుత్వం. పేదలు బతకడం కష్టమైంది. ఆకలి నిరుద్యోగం, పేదరికం పెరిగింది. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. ఈ పదేండ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండే. నిరుద్యోగులను బీజేపీ మోసం చేసింది అని హరీశ్రావు ధ్వజమెత్తారు.
బీజేపీ నాయకులకు చెప్పుకోవడానికి పథకాలు లేవు కనుక చిత్రపటాలు, క్యాలెండర్లు, బ్యాగులు, చీరలు పంచుతున్నారు. ఇదేనా బీజేపీ చేసే పని..? దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు ఇస్తే.. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు. దేశంలోని ఆయా రాష్ట్రాలకు 157 నర్సింగ్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు మొండి చేయి చూపించారు. పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వకుండా మోసం చేసింది. గత ఎంపీ ఎన్నికల్లో మోదీ మహబూబ్నగర్ వచ్చి పాలమూరు – రంగారెడ్డి పూర్తి చేస్తామని చెప్పి కనీసం అనుమతి ఇవ్వలేదు. ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. బీజేపీ నాయకులు మాటలతో మాయ చేయాలని చూస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు హరీశ్రావు సూచించారు.