Harish rao | సంగారెడి/మెదక్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటయ్యాయన్న ప్రచారంలో నిజం లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీమంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. అదే నిజమైతే కవిత ఎందుకు అరెస్ట్ అయ్యేవారని ప్రశ్నించారు. తమతో కలిసి రాలేదనే కవితను, కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఒకటేనని.. మైనార్టీలు కాంగ్రెస్కు ఓటువేసి వృథా చేసుకోవద్దని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు మైనార్టీ వర్గం నుంచి ఒక్క మంత్రి కూడా లేకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ను పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించి బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో మంగళవారం మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలోను, అనంతరం మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోను హారీశ్రావు మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్కు కంచుకోట అయిన మెదక్ పార్లమెంటు స్థానంలో గులాబీ జెండా మరోమారు రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు. సౌమ్యుడు, పేదలకు అండగా నిలిచే వెంకట్రామిరెడ్డిని ఎంపీగా గెలిపించాలని ఓటర్లను కోరారు. బీజేపీ అభ్యర్థి పనిమంతుడు అయితే అసెంబ్లీ ఎన్నికల్లోనే దుబ్బాక ప్రజలు గెలిపించేవారని, పనికిరాడు కాబట్టే ఓడించారని విమర్శించారు.
వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామన్న రేవంత్రెడ్డి విఫలమయ్యారని హరీశ్రావు విమర్శించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా మోసం చేశారని దుమ్మెత్తిపోశారు. రైతులు సాగునీరు, కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారని, పంటలు ఎండుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్కు చురకలు పెడితేనే గ్యారెంటీలు అమలు చేస్తుందని చెప్పారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా తెలంగాణకు బీజేపీ తీవ్ర అన్యాయం చేసిందని హరీశ్రావు పేర్కొన్నారు. ఇతర పార్టీలకు ఎలాంటి సిద్ధాంతాలు ఉన్నా, బీఆర్ఎస్ది మాత్రం తెలంగాణ ఆత్మగౌరవమే ఎజెండా అని స్పష్టం చేశారు. గత పదేండ్లలో ప్రజలకు తాగునీరు, విద్యుత్తు సమస్యను కేసీఆర్ శాశ్వతంగా దూరం చేశారని పేర్కొన్నారు.
రేవంత్రెడ్డిది బూతుల పాలన మాత్రమే కాదని, బూటకపు పాలన కూడా అని ప్రజలకు తెలిసిపోయిందని హరీశ్రావు పేర్కొన్నారు. పాత స్కీంలకు పాతరేసి, కొత్త స్కీంలలో కోతపెట్టారని దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్కు ఎందుకు ఓటువేయాలని నిలదీశారు. ప్రతిపక్ష కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టినందుకు ఓటేయాలా? అని ప్రశ్నించారు. ఆసరా పింఛన్ లబ్ధిదారులు రూ. 4వేలు, రైతుబంధు రూ. 15 వేలు అందుకున్నవారు, రుణమాఫీ అమలైన వారు మాత్రమే కాంగ్రెస్కు ఓటేయాలని, రానివాళ్లు బీఆర్ఎస్కు ఓటేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు 180 మంది రైతులు, 38 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
తనను మెదక్ ఎంపీగా గెలిపిస్తే పేద విద్యార్థులు, బీఆర్ఎస్ కార్యకర్తల పిల్లల చదువుల కోసం రూ.100 కోట్లతో పీవీఆర్ ట్రస్టు ఏర్పాటు చేస్తానని మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంట్రామిరెడ్డి హామీ ఇచ్చారు. ఐఏఎస్ అధికారిగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 11 ఏండ్ల పాటు సేవలు అందించానని, ఇక్కడి ప్రజలతో తనకు ఆత్మీయ అనుబంధం ఉందని చెప్పారు. సిద్దిపేట ప్రాంతానికి చెందిన సౌమ్యతోపాటు పలువురు పేద పిల్లలను దత్తత తీసుకుని ఉన్నత చదువులకు సహకరిస్తున్నట్టు చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, పార్టీ కార్యకర్తలు ఉపయోగించుకునేలా మెదక్వ్యాప్తంగా ఫంక్షన్హాళ్లు నిర్మిస్తానని తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు తన విజయానికి సహకరించాలని కోరారు. సమావేశాల్లో ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, శివకుమార్, మామిళ్ల రాజేందర్, మాణిక్యం, బుచ్చిరెడ్డి, నరహరిరెడ్డి, జైపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.