Bajireddy Govardhan | హైదరాబాద్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహా ఆ పార్టీ నేతలందరిదీ అబద్దాల బతుకు అని ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ఆరోపించారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను నియమించుకోవటమే ఆ పార్టీ దురదృష్టకరమన్నారు. బండి సంజయ్కు రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా పంట నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి ఎకరానికి రూ. 10 వేలు తేవాలని ఆయన డిమాండ్ చేశారు.
బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటున్నదన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు జిల్లాల్లో సీఎం కేసీఆర్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారని, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ నాలుగు జిల్లాల రైతులతో మాట్లాడి రాష్ట్రవ్యాప్తంగా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10 వేల ఆర్థిక సహాయాన్ని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ క్షేత్రస్థాయిలో పర్యటించింది బండికి కనిపించలేదా? అని ఆయన ప్రశ్నించారు. వాస్తవాలను ఒప్పుకునే ధైర్యం లేక, బండి సంజయ్ తీవ్ర అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అలాగే ప్రస్తుతం కురిసిన అకాల వర్షాలకు అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నదని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అకాల వర్షాలతో పంట నష్టపోయిన ప్రతీరైతుకు సీఎం కేసీఆర్ అండగా ఉంటారని ఆయన చెప్పారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రూ. 154 కోట్లను విడుదల చేసిందని, ఈ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. ఇవన్నీ బండి సంజయ్కు కనిపించవని ఆయన ఆరోపించారు. అమాయక ప్రజలను, రైతులను రెచ్చగొట్టడమే రాజకీయంగా బండి సంజయ్ భావిస్తున్నారని ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ దుయ్యబట్టారు.